బైబై గణేశా

ABN , First Publish Date - 2022-09-10T05:30:00+05:30 IST

జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో శనివారం వినాయక నిమజ్జనాలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని వివిధ కాలనీల్లో ప్రతిష్ఠించిన గణనాథులను ప్రత్యేకంగా అలంకరించిన వాహనాల్లో ఊరేగింపుగా తరలించి పట్టణంలోని వినాయక్‌సాగర్‌లో నిమజ్జనం చేశారు. వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో పాత బస్టాండ్‌ వద్ద వేదిక ఏర్పాటు చేసి పూలను చల్లుతూ శోభాయాత్రకు స్వాగతం పలికారు. ఊరేగింపులో భజనలు, భక్తి గీతాలు, కళాకారులతో ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

బైబై గణేశా
సంగారెడ్డిలో గంగమ్మ ఒడికి చేరుతున్న గణనాథుడు

భక్తిశ్రద్ధలతో వినాయకుల నిమజ్జనం

కోలాహలంగా శోభాయాత్రలు


సంగారెడ్డి రూరల్‌/సంగారెడ్డి అర్బన్‌/కల్హేర్‌/నారాయణఖేడ్‌/పెద్దశంకరంపేట/చిన్నశంకరంపేట, సెప్టెంబరు 10 : జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో శనివారం వినాయక నిమజ్జనాలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని వివిధ కాలనీల్లో ప్రతిష్ఠించిన గణనాథులను ప్రత్యేకంగా అలంకరించిన వాహనాల్లో ఊరేగింపుగా తరలించి పట్టణంలోని వినాయక్‌సాగర్‌లో నిమజ్జనం చేశారు. వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో పాత బస్టాండ్‌ వద్ద వేదిక ఏర్పాటు చేసి పూలను చల్లుతూ శోభాయాత్రకు స్వాగతం పలికారు. ఊరేగింపులో భజనలు, భక్తి గీతాలు, కళాకారులతో ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. యువత బ్యాండుచప్పుళ్ల నడుమ తీన్మార్‌ నృత్యాలతో సందడి చేశారు. నిమజ్జనోత్సవాన్ని వీక్షించేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు పెద్దసంఖ్యలో తరలిరావడంతో సంగారెడ్డి పట్టణం జనసందోహంగా మారింది. వినాయక నిమజ్జనోత్సవం సందర్భంగా సంగారెడ్డి డీఎస్పీ రవీంద్రరెడ్డి, పట్టణ సీఐ రమేష్‌, రూరల్‌ సీఐ శివలింగం ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో సంగారెడ్డి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ విజయలక్ష్మిరవి, మున్సిపల్‌ కమిషనర్‌ చంద్రశేఖర్‌, డీఈ ఇంతియాజ్‌ అహ్మద్‌ తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి శివారులోని శ్రీవైకుంఠపురంలో ఏర్పాటు చేసిన మట్టి గణపతిని ఆలయ ప్రాంగణంలోని కొలనులో నిమజ్జనం నిర్వహించారు. అంతకుముందు ప్రధానార్చకులు కందాడై వరదాచార్యులు ఆఽధ్వర్యంలో గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కల్హేర్‌, సిర్గాపూర్‌ మండల కేంద్రాల్లో నిమజ్జనాలు ఘనంగా నిర్వహించారు. సిర్గాపూర్‌లో సేవాభారతి యువజన సంఘం వినాయక నిమజ్జనం సందర్భంగా నిర్వహించిన భజన ఎంతో ఆకట్టుకుంది. నారాయణఖేడ్‌ మండలంలో 22 విగ్రహాలను, మనూరులో 11 విగ్రహాలను నిమజ్జనం చేశారు. ఖేడ్‌ శివారులోని కమలాపూర్‌ చెరువు వద్ద మున్సిపల్‌ అధికారులు నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేశారు. మెదక్‌ జిల్లా పెద్దశంకరపేటలో శనివారం ఉదయం వరకు నిమజ్జనాలు కొనసాగాయి. తిరుమలాపూర్‌ చెరువులో ప్రత్యేక క్రేన్‌ సహాయంతో నిమజ్జనం చేశారు. చిన్నశంకరంపేట మండలంలోని జంగరాయి, టీమాందాపూర్‌, మిర్జాపల్లి, మాలుపల్లి తదితర గ్రామాల్లో వినాయకులను నిమజ్జనం చేశారు. 


మెదక్‌లో నిమజ్జనానికి సర్వం సిద్ధం

మెదక్‌ అర్బన్‌, సెప్టెంబరు 10: జిల్లాకేంద్రమైన మెదక్‌లో గణనాథుల నిమజ్జనానికి అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. పట్టణంతో పాటు ఆయా గ్రామాల చెరువుల్లో సౌకర్యాలను ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలోని వినాయకులను నిమజ్జనం చేసే కొంటూర్‌ చెరువు వద్ద  పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. రెవెన్యూ, విద్యుత్‌, మున్సిపల్‌శాఖ అధికారులు, క్రేన్లు, లైటింగ్‌,ట్రాఫిక్‌ ఏర్పాట్లు చేపట్టారు. మెదక్‌ మున్సిపల్‌ చైర్మన్‌ చంద్రపాల్‌ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. గణేష్‌ శోభాయాత్రకు 750 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు ఎస్పీ రోహిణి ప్రియదర్శిని తెలియజేశారు. పెట్రోలింగ్‌ వాహనాలు, ఐడీపార్టీ, షీటీమ్‌ ఏర్పాటు చేసినట్టు తెలియజేశారు. నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని, వాహనాలపై ఎక్కువ మంది ఉండకుండా చూడాలని సూచించారు.

Updated Date - 2022-09-10T05:30:00+05:30 IST