కరోనా కట్టడికే ఇంటింటి జ్వర సర్వే

ABN , First Publish Date - 2022-01-23T04:44:55+05:30 IST

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఫీవర్‌ సర్వేను చేపడుతున్నట్లు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు చెప్పారు.

కరోనా కట్టడికే ఇంటింటి జ్వర సర్వే

సిద్దిపేట టౌన్‌, జనవరి 22: కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఫీవర్‌ సర్వేను చేపడుతున్నట్లు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు చెప్పారు. శనివారం సిద్దిపేట పట్టణంలోని 37వ వార్డు అంబేడ్కర్‌నగర్‌లో చేపట్టిన సర్వేను క్షేత్ర స్థాయిలో మంత్రి హరీశ్‌రావు పరిశీలించారు. రెండు డోస్‌ల టీకా వేసుకున్నారా అని అడిగి తెలుసుకున్నారు. ప్రజలంతా ప్రభుత్వం చేస్తున్న ఫీవర్‌ సర్వేకు సహకరించాలని కోరారు. రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని మంత్రి చెప్పారు. ప్రతీ రోజు లక్షకు పైగా కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు జరుపుతున్నామని, 2 కోట్ల టెస్టు కిట్లు, కోటి హోమ్‌ ఐసోలేషన్‌ కిట్లు, 27 వేల ఆక్సిజన్‌ బెడ్లు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. ప్రజలు ఆందోళన చెందొద్దని, ప్రైవేటు ఆసుపత్రులకు పోవద్దని సూచించారు. ఫీవర్‌ సర్వేలో భాగంగా మొదటి రోజు 12 లక్షల 68 వేల ఇళ్లలో 48 వేల మందికి హోమ్‌ ఐసోలేషన్‌ కిట్లు అందించినట్లు తెలిపారు. 5 నుంచి 8 వారాలు ఫీవర్‌ సర్వే కొనసాగుతుందని మంత్రి పేర్కొన్నారు. కరోనా కట్టడిలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసికట్టుగా పోరాడుదామని పిలుపునిచ్చారు. ప్రజలు ఎవరూ నిర్లక్ష్యంగా ఉండొద్దని, ప్రతీ ఒక్కరు టీకా వేసుకోవాలని సూచించారు. మంత్రి వెంట మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మంజులరాజనర్సు, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పాల సాయిరాం, డీఏంహెచ్‌వో మనోహర్‌, జిల్లా నోడల్‌ వైద్యాధికారి కాశీనాథ్‌, మున్సిపల్‌ కమిషనర్‌ రవీందర్‌రెడ్డి, ప్రజాప్రతినిధులు, మున్సిపల్‌ సిబ్బంది ఉన్నారు.


 

Updated Date - 2022-01-23T04:44:55+05:30 IST