వడ్లు కొనడం లేదంటూ రైతుల రాస్తారోకో
ABN , First Publish Date - 2022-05-29T05:11:20+05:30 IST
వడ్లు కొనుగోలు లేదంటూ రైతులు రేగోడు గాంధీ చౌక్ వద్ద శనివారం రాస్తారోకో చేశారు. మండలంలోని చౌదర్పల్లి గ్రామంలోని కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ రైతులు ఆందోళన చేశారు.
రేగోడు మే 28: వడ్లు కొనుగోలు లేదంటూ రైతులు రేగోడు గాంధీ చౌక్ వద్ద శనివారం రాస్తారోకో చేశారు. మండలంలోని చౌదర్పల్లి గ్రామంలోని కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ రైతులు ఆందోళన చేశారు. వడ్లు కొనుగోలు చేసే వరకు రోడ్డుపై నుంచి కదిలేది లేదంటూ భీష్మించుకు కూర్చున్నారు. ఓ దశలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు యత్నించారు. కాగా ఎస్ఐ సత్యనారాయణ జోక్యం చేసుకొని రైతులకు సర్దిజెప్పారు. కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యాన్ని కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కొనుగోలు కేంద్రం నిర్వాహకులతో కూడా రైతులకు హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. కాగా రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కొనుగోలు కేంద్రాల్లోని మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని తహసీల్దార్ సర్దార్ హర్దీ్ఫసింగ్ చెప్పారు. లారీల కొరత, హమాలీల ఇబ్బంది ఉందని, దీనిపై జిల్లా అధికారులకు వివరించామని తెలిపారు.
కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన ఏడీఏ
పెద్దశంకరంపేట, మే 28: పెద్దశంకరంపేటలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పెద్దశంకరంపేట వ్యవసాయాధికారి ఏడీఏ రాంప్రసాద్ శనివారం తనిఖీ చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఆయన వెంట ఏవో ప్రవీణ్, విజిలెన్స్ కమిటీ సభ్యులు రవీందర్నాయక్, తదితరులు ఉన్నారు.