సమస్యలను పరిష్కరించడంలో అధికారుల విఫలం
ABN , First Publish Date - 2022-10-13T04:57:04+05:30 IST
సమస్యలను పరిష్కరించడంలో అధికారులు విఫలమయ్యారని మండల సభలో సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మండల సభలో సభ్యుల ఆగ్రహం
గుమ్మడిదల, అక్టోబరు 12: సమస్యలను పరిష్కరించడంలో అధికారులు విఫలమయ్యారని మండల సభలో సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గుమ్మడిదల మండల సర్వసభ్య సమావేశం బుధవారం ఎంపీపీ సద్ది ప్రవీణవిజయభాస్కర్రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. సమావేశానికి హాజరుకాని, సమయపాలన పాటించని అధికారులపై, ప్రజాప్రతినిధులపై చర్యలు తీసుకునే విధంగా అధికార యంత్రాంగం పనిచేయాలని ఎంపీడీవో చంద్రశేఖర్కు ఎంపీపీ ప్రవీణభాస్కర్రెడ్డి, జడ్పీటీసీ కుమార్గౌడ్ సూచించారు. ఇరిగేషన్, విద్యా, పశుసంవర్థక అధికారుల పనితీరు బాగోలేదని సభ్యులు మండిపడ్డారు. ఇరిగేషన్ అధికారులు నిర్లక్ష్యం వీడి మండలంలోని అన్ని గ్రామాల చెరువులు, కుంటలను పరిశీలించాలని కోరారు. కాగా ఏడాదిన్నర కాలంలో నిర్వహించిన సమావేశాలతో పాటు బుధవారం నాటి సమావేశానికి కూడా ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి హాజరు కాకపోవడం పట్ల ప్రజా ప్రతినిధులు అసంతృప్తి వ్యక్తపరిచారు. ఈ సమావేశంలో తహసీల్దార్ సుజాత, ఎంపీటీసీలు, సర్పంచులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.