గ్రామీణ క్రీడాకారులకు ప్రోత్సాహం
ABN , First Publish Date - 2022-05-23T04:59:36+05:30 IST
గ్రామీణ ప్రాంతాల్లో క్రీడల నిర్వహణపై సర్కారు దృష్టి సారించింది. తెలంగాణ గ్రామ క్రీడా ప్రాంగణం పేరిట మైదానాలు ఏర్పాటు చేయడానికి శ్రీకారం చుట్టింది.
ఇక పల్లెల్లో క్రీడా ప్రాంగణాలు
అనువైన స్థలాలను ఎంపిక చేసే బాధ్యత తహసీల్దార్లకు
మెదక్ జిల్లాలో ఇప్పటి వరకు 318 స్థలాల గుర్తింపు
జూన్ 2న ప్రారంభించాలని సీఎం కేసీఆర్ ఆదేశం
మెదక్ అర్బన్, మే 22: గ్రామీణ ప్రాంతాల్లో క్రీడల నిర్వహణపై సర్కారు దృష్టి సారించింది. తెలంగాణ గ్రామ క్రీడా ప్రాంగణం పేరిట మైదానాలు ఏర్పాటు చేయడానికి శ్రీకారం చుట్టింది. గ్రామీణ క్రీడాకారుల సౌకర్యార్థం మెదక్ జిల్లా అధికార యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్, అధికారులు స్థలాల ఎంపిక కోసం అన్వేషిస్తున్నారు. అనువైన స్థలాలను గుర్తించాలని ఇప్పటికే తహసీల్దార్లను ఆదేశించారు. ఈ పథకంపై ఇటీవల సీఎం కేసీఆర్ సమీక్షించారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎంపిక చేసిన కొన్నిగ్రామాల్లో ప్రాంగణాలను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.
వసతులు లేక ప్రతిభ కనుమరుగు
గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడా సరైన వసతులతో కూడిన ఆట స్థలాలు లేవు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో తప్ప బయట పెద్దగా క్రీడామైదానాలు, ఆడిటోరియాలేవు. ఇవి కూడా అలంకారప్రాయంగానే మిగిలాయి. ఎలాంటి ఆట పరికరాలు, సరైన ప్రాంగణాలు లేవు. ఫలితంగా యువకులు, చిన్నారుల్లోని క్రీడా నైపుణ్యాలు మరుగున పడుతున్నాయి. సమీపంలో ఉన్న పట్టణాలకు వెళ్లి శిక్షణ తీసుకునే స్థోమత లేక ప్రతిభ వెలుగులోకి రావడం లేదు. చాలా గ్రామాల్లో వాలీబాల్, కబడ్డీ ఆటలు ఆడుకోవడానికి కూడా స్థలాలు లేవు. పాఠశాలల్లో మైదానాలు లేకపోవడంతో విద్యార్థులు చదువులకే పరిమితవుతున్నారు. అసలే పరిస్థితి అంతంత మాత్రం అనుకుంటే కొవిడ్ కారణంగా పాఠశాలలు తెర్చుకోక క్రీడా ప్రాంగణాల్లో పిచ్చిమొక్కలు, గడ్డి మొలిచాయి. పరికరాలు, పనికిరాకుండా పోయాయి. ప్రభుత్వ తాజా నిర్ణయంతో మెదక్ జిల్లా వ్యాప్తంగా 469 గ్రామపంచాయతీల్లో తెలంగాణ క్రీడాప్రాంగణాలు ఏర్పాటు కానున్నాయి.
మెదక్ జిల్లాలో 318 గ్రామాల్లో గుర్తింపు
జిల్లాలో మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాలున్నాయి. మెదక్ జిల్లావ్యాప్తంగా 469 గ్రామ పంచాయతీలున్నాయి. ఇక ప్రతి గ్రామపంచాయతీలో వాటికి అనుబంధ గ్రామాల్లో ప్రభుత్వ స్థలాలను గుర్తించటం, పెద్ద గ్రామాల్లో ఎకరం, చిన్నపంచాయతీల్లో అరెకరంలో క్రీడా మైదానం ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. క్రీడా మైదానాలు సాదాసీదాగా కాకుండా పల్లె ప్రగతి, మిగతా పనులు ఏ విధంగా శాశ్వత ప్రాతిపదికన చేపట్టారో వీటిని కూడా అదేవిధంగా చేపట్టాలని ఆదేశాలు వచ్చాయి. మెదక్ జిల్లా వ్యాప్తంగా 469 గ్రామ పంచాయతీలుండగా.. ఇప్పటి వరకు 318 గ్రామ పంచాయతీల్లో అనువైన స్థలాలను గుర్తించారు. క్రీడా మైదానాలకు స్థల గుర్తింపు తర్వాత.. వాటి అభివృద్ధికి ఉపాధి నిధులు వాడుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మైదానంలో కంపచెట్లు తొలగించటం, భూమి చదును చేయటం, అవసరమైన చోట మట్టినింపటం, చుట్టూ హరితహారంలో మొక్కలు నాటటం తదితర అభివృద్ది పనులు ఉపాధిహామీ నిధులతో చేపట్టనున్నారు. దాంతో పాటే నియోజకవర్గాల పరిధిలోని పరిశ్రమలు ఏటా చెల్లించే సీఎ్సఆర్ నిధుల ద్వారా క్రీడాకారులకు వసతులు సమకూర్చనున్నారు.
స్థల పరిశీలన పూర్తి
- రమేశ్, జిల్లా అదనపు కలెక్టర్, మెదక్
గ్రామీణ క్రీడా ప్రాంగణాల ఏర్పాటు కోసం ప్రభుత్వ స్థలాల పరిశీలన ప్రారంభించాం. జిల్లావ్యాప్తంగా 469 గ్రామపంచాయతీలుండగా ఇప్పటి వరకు 318 గ్రామ పంచాయతీల్లో స్థలాల గుర్తింపు ప్రక్రియ పూరైంది. మిగిలిన స్థలాల గుర్తింపు పూర్తిగానే ప్రభుత్వ అనుమతితో పనులు మొదలుపెడతాం.