ప్రోత్సాహమేదీ?

ABN , First Publish Date - 2022-11-28T00:08:03+05:30 IST

అధిక సాంద్రత పత్తిసాగుకు ‘ప్రోత్సాహం’ కరువు ఎకరానికి రూ.4వేలు ఇస్తామన్న ప్రభుత్వం వానాకాలంలో పత్తి సాగు చేయాలని ప్రచారం చేసిన అధికారులు పంట చేతికొచ్చినా రైతులకు అందని సాయం

ప్రోత్సాహమేదీ?
అధిక సాంద్రత పత్తిసాగుపై రైతులకు అవగాహన కల్పిస్తున్న అధికారులు (ఫైల్‌)

సిద్దిపేట అగ్రికల్చర్‌, నవంబరు 27: అధిక సాంద్రత గల పత్తి విత్తనాల సాగుతో లాభం చేకూరుతుందని అధికారులు ప్రచారం నిర్వహించారు. అంతేకాకుండా ప్రభుత్వం రూ.4వేల ప్రోత్సాహాన్ని కూడా పంట సాగు దశలోనే రైతుల ఖాతాల్లో జమ చేస్తుందని చెప్పారు. దీంతో పంట పెట్టుబడికి ప్రభుత్వం ఇచ్చే డబ్బులు ఉపయోగపడతాయని ఆశపడిన రైతులు.. పత్తి దిగుబడి కూడా ఉంటుందనుకొని ప్రభుత్వం సూచించినట్లుగా అధిక సాంద్రత గల పత్తి విత్తనాలను సాగు చేశారు. ప్రస్తుతం ఈ పత్తి చేతికొస్తున్నా ప్రోత్సాహం జాడ లేకుండా పోయింది.

622మంది రైతులు 1,040ఎకరాల్లో సాగు

అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు చేస్తే అధిక దిగుబడి వస్తుందంటూ వ్యవసాయశాఖాధికారులు ప్రచారం చేశారు. మొదట రైతులు స్పందించకపోయినప్పటికీ ప్రభుత్వం నుంచి రూ.4వేలు ప్రోత్సాహంతో పాటు అధిక దిగుబడి వస్తుందనే ఆశతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో రైతులు ఈ పద్ధతిలో పంట సాగు చేశారు. అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు చేసేందుకు ప్రభుత్వం జిల్లాలోని 17 మండలాల్లో ఒక్కో మండలానికి సుమారు 60 నుంచి 100 ఎకరాలను పైలెట్‌ ప్రాజెక్ట్‌ కింద ఎంపిక చేసింది. ఈ మేరకు వానాకాలం సీజన్‌లో జిల్లాలో 1.14 లక్షల ఎకరాల్లో పత్తిని సాగు చేయగా.. ఎంపిక చేసిన ప్రాంతాల్లో 1,040ఎకరాల్లో 622మంది రైతులు అధిక సాంధ్రత రకం పత్తిని సాగు చేశారు. 622మంది రైతులకు ప్రభుత్వం తరఫున ఒక్కో ఎకరానికి రూ.4 వేల చొప్పున 1,040 ఎకరాల గాను రూ.41.6 లక్షల ప్రోత్సాహ డబ్బు అందాల్సి ఉంది. అధికారులు రైతుల ఖాతాల్లోనే ప్రోత్సాహం డబ్బు జమ అవుతుందని చెప్పినా.. పత్తి ఏరుతున్న దశలో కూడా ఖాతాల్లో జమ కాలేదు. అధికారులను అడిగితే వస్తాయని చెబుతున్నారని రైతులు అంటున్నారు. ఇప్పటికైనా ప్రోత్సాహం డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేయాలని కోరుతున్నారు.

Updated Date - 2022-11-28T00:08:09+05:30 IST