శరవేగంగా రైల్వే లైన్ విద్యుదీకరణ
ABN , First Publish Date - 2022-06-25T04:44:32+05:30 IST
సికింద్రాబాద్-ముత్కెడ్ రైల్వే మార్గంలో విద్యుదీకరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి మెదక్ జిల్లా మనోహరాబాద్ వరకు రైల్వే లైన్ విద్యుదీకరణ ఇప్పటికే పూర్తి చేశారు. మనోహరాబాద్ నుంచి ముత్కెడ్ మార్గంలో పనులు కొనసాగుతున్నాయి. సికింద్రాబాద్-నిజామాబాద్ రైలు మార్గంలో గతంలో మీటర్గేజ్ రైల్వే లైను ఉండగా బ్రాడ్గేజ్గా మార్చారు.
సికింద్రాబాద్ నుంచి ముత్కెడ్ వరకు 230 కిలోమీటర్ల విద్యుదీకరణకు పంచ్చ జెండా
2019 బడ్జెట్లోనే నిధుల కేటాయింపులు
మొదటి విడతలో నిజామాబాద్ వరకు పనులు
తూప్రాన్, జూన్ 24: సికింద్రాబాద్-ముత్కెడ్ రైల్వే మార్గంలో విద్యుదీకరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి మెదక్ జిల్లా మనోహరాబాద్ వరకు రైల్వే లైన్ విద్యుదీకరణ ఇప్పటికే పూర్తి చేశారు. మనోహరాబాద్ నుంచి ముత్కెడ్ మార్గంలో పనులు కొనసాగుతున్నాయి. సికింద్రాబాద్-నిజామాబాద్ రైలు మార్గంలో గతంలో మీటర్గేజ్ రైల్వే లైను ఉండగా బ్రాడ్గేజ్గా మార్చారు. ప్రస్తుతం డిజిల్ ఇంజన్ రైళ్లను మాత్రమే ఈ మార్గంలో నడుపుతున్నారు. వీటి స్థానంలో అధునాత విద్యుత్ ఇంజన్ రైళ్లను నడపాలని దక్షిణమధ్య రైల్వే నిశ్చయించింది. మనోహరాబాద్ నుంచి ముత్కెడ్ వరకు రైల్వేలైను విద్యుదీకరణ చేసేందుకు 2019 బడ్జెట్లో రూ. 1,713 కోట్లను కేటాయించారు. ముత్కెడ్ మార్గంలో 230 కిలోమీటర్ల రైల్వేలైను విద్యుదీకరణ పనులను కేపీటీఎల్ సంస్థ నిర్వహిస్తున్నది. మొదటి విడతలో నిజామాబాద్ వరకు 130 కిలోమీటర్ల మేర పనులు నిర్వహిస్తున్నారు. రెండో విడతలో నిజామాబాద్ నుంచి ముత్కెడ్ వరకు 100 కిలోమీటర్ల రైల్వే మార్గం విద్యుదీకరణ చేసేందుకు నిర్ణయించారు. నిధులున్నా కరోనా కారణంగా రెండేళ్లుగా పనులు చేపట్టలేదు. పరిస్థితులు చక్కబడటంతో ఆరు నెలల క్రితం పనులను ప్రారంభించారు. ముందుగా పట్టాల పక్కన విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేసేందుకు సిమెంట్ దిమ్మెలను జనవరి మాసంలో నిర్మించారు. సిమెంట్ దిమ్మెలు వేయడం పూర్తికాగానే స్తంభాలను బిగించారు. ప్రస్తుతం స్తంభాలపై విద్యుత్ లైన్లు వేస్తున్నారు. కరెంటు లైన్ వేసేందుకు ప్రత్యేక రైలు బోగిని వినియోగిస్తున్నారు. ప్రస్తుతం వడియారం (చేగుంట)-మిర్జాపల్లి రైల్వేస్టేషన్ల మధ్య కరెంటు తీగల ఏర్పాటు పనులు కొనసాగుతున్నాయి. ఈ పనులు పూర్తయితే మనోహరాబాద్ నుంచి నిజామాబాద్ మార్గంలోనే త్వరలోనే విద్యుత్ రైళ్లు పరుగులు తీయనున్నాయి. అంతేకాకుండా మనోహరాబాద్ వరకు ఎంఎంటీఎస్ రైళ్లను కూడా నడిపించనున్నట్టు తెలిసింది.