సివిల్స్ ర్యాంకు సాధించిన జిల్లా ఆణిముత్యాలు
ABN , First Publish Date - 2022-05-31T05:32:46+05:30 IST
సిద్దిపేట జిల్లాకు చెందిన ఇద్దరు తొలి ప్రయత్నంలోనే సివిల్స్ ర్యాంకును సాధించారు. సోమవారం విడుదల చేసిన యూపీఎస్సీ పరీక్షా ఫలితాల్లో కొండపాక మండల కేంద్రానికి చెందిన బుద్ధి అఖిల్ 566వ ర్యాంకును, జగదేవ్పూర్కు చెందిన ధరావత్ సాయిప్రకాష్ 650వ ర్యాంకును పొందారు.
తొలిప్రయత్నంలోనే ఇద్దరికి ర్యాంకులు
కొండపాక/జగదేవ్పూర్, మే 30: సిద్దిపేట జిల్లాకు చెందిన ఇద్దరు తొలి ప్రయత్నంలోనే సివిల్స్ ర్యాంకును సాధించారు. సోమవారం విడుదల చేసిన యూపీఎస్సీ పరీక్షా ఫలితాల్లో కొండపాక మండల కేంద్రానికి చెందిన బుద్ధి అఖిల్ 566వ ర్యాంకును, జగదేవ్పూర్కు చెందిన ధరావత్ సాయిప్రకాష్ 650వ ర్యాంకును పొందారు.
పేద కుటుంబానికి చెందిన బుద్ధి అఖిల్ కొండపాక గ్రామంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఏడో తరగతి వరకు చదివాడు. అనంతరం సిద్దిపేటలోని రవీంద్రపబ్లిక్ స్కూల్లో పదో తరగతి వరకు, మాస్టర్మైండ్స్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేశారు. కాకతీయ యూనివర్సిటీలో బీటెక్ చదివి అనంతరం సివిల్స్ కోచింగ్ తీసుకున్నారు. సీఎస్బీ ఐఏఎస్ అకాడమీలో చేరి కోచింగ్ పూర్తిచేశారు. అఖిల్ తండ్రి నరేష్ పీఎంపీగా గ్రామంలో వైద్య సేవలందిస్తున్నారు. తనకు ఉన్న రెండు ఎకరాల్లో వ్యవసాయం చేస్తూ కష్టపడి పిల్లలను చదివించాడు. నిరుపేద కుటుంబం నుంచి సివిల్స్ వరకు వచ్చిన ఆ కుటుంబాన్ని పలువురు అభినందించారు. ఫలితాలు రాగానే అఖిల్ను మాజీ ఎంపీపీ బొద్దుల కనకయ్యతో పాటు పలువురు అభినందించారు. తెలంగాణ జాగృతి గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు అనంతుల ప్రశాంత్ అఖిల్తో పాటు అతడి తండ్రిని శాలువాతో సత్కరించారు.
జగదేవ్పూర్ మండలం నబీనగర్ ప్రైమరీ స్కూల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు ధరావత్ రవీందర్ కుమారుడు ధరావత్ సాయిప్రకాష్ మొదటి ప్రయత్నంలోనే మంచి ర్యాంకు సాధించడం పట్ల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. సాయిప్రకాష్ 10వ తరగతి వరకు జగదేవ్పూర్లోని వాగ్దేవి ప్రైవేట్ స్కూల్, ఇంటర్ కూకట్పల్లిలోని నారాయణ, డిగ్రీ పసుమాముల నారాయణ ఐఏఎస్ అకాడమీలో పూర్తి చేశారు. 2018లో ఢిల్లీలో కోచింగ్ తీసుకున్నాడు. సాయిప్రకాష్ చిన్నప్పటి నుంచి చదువులో చురుగ్గా ఉండేవాడని తండ్రి రవీందర్ తెలిపారు.