మాచిన్పల్లిలో చిరుత కలకలం
ABN , First Publish Date - 2022-11-30T23:59:31+05:30 IST
దౌల్తాబాద్ మండలం మాచిన్పల్లి అటవీ ప్రాంతంలో చిరుత సంచారం కలకలం రేపుతోంది.
రాయపోల్, నవంబరు 30 : దౌల్తాబాద్ మండలం మాచిన్పల్లి అటవీ ప్రాంతంలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. మాచిన్పల్లి మధిర గ్రామానికి చెందిన శివరాజయ్య మంగళవారం సాయంత్రం తన దూడను అటవీ సమీపంలోని కొట్టంలో కట్టేసి ఇంటికి వెళ్లాడు. బుధవారం ఉదయం వచ్చి చూసేసరికి దూడ చనిపోయి ఉండగా పేగులు బయటకు వచ్చాయి. ఈ విషయమై ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించగా సెక్షన్ఆఫీసర్ అహ్మద్ హుస్సేన్, బీట్ ఆఫీసర్ జహంగీర్ సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. చిరుత దాడి చేసి ఉండవచ్చని అనుమానించి పశు వైద్యాధికారి రాజేందర్రెడ్డికి సమాచారం ఇచ్చి పోస్టుమార్టం నిర్వహించారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు సూచించారు. సంఘటనా స్థలంలో ట్రాప్ కెమెరా ఏర్పాటు చేస్తున్నట్లు అటవీ అధికారులు పేర్కొన్నారు.