వజ్రోత్సవాలపై కేంద్రం చిన్నచూపు
ABN , First Publish Date - 2022-08-11T06:08:01+05:30 IST
దేశంలో చాలాచోట్ల జాతీయ జెండాలను సరఫరా చేయలేక చేతులెత్తేసి, వజ్రోత్సవాలపై కేంద్రం చిన్నచూపు చూస్తుందని మంత్రి హరీశ్రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
జాతీయ జెండాలు ఇవ్వడంలో నిర్లక్ష్యం
కేంద్రం తీరుపై మంత్రి హరీశ్ మండిపాటు
సిద్దిపేటటౌన్, ఆగస్టు10: దేశంలో చాలాచోట్ల జాతీయ జెండాలను సరఫరా చేయలేక చేతులెత్తేసి, వజ్రోత్సవాలపై కేంద్రం చిన్నచూపు చూస్తుందని మంత్రి హరీశ్రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బుధవారం సిద్దిపేటలోని రంగనాయకసాగర్లో ఏర్పాటు చేసిన ఫ్రీడం పార్కును అదనపు కలెక్టర్ ముజామిల్ఖాన్, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, ‘సుడా’ చైర్మన్ రవీందర్రెడ్డితో కలిసి హరీశ్రావు ప్రారంభించి మాట్లాడారు. కేంద్రమంత్రి కిషన్రెడ్డి జాతీయ జెండాకు బదులు కాగితాలు అంటించుకోవాలని చెప్పడం సిగ్గుచేటని, ఆయన వ్యాఖ్యలు అవమానకరంగా ఉన్నాయన్నారు. వజ్రోత్సవాల్లో భాగంగా జాతీయ జెండాకు మీరిచ్చే విలువ ఇదేనా అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. 75 ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా వజ్రోత్సవాలను తెలంగాణ ప్రభుత్వం అత్యంత వైభవంగా జరుపుకుంటుందని చెప్పారు. గాంధీ బాటలో ప్రపంచం నడిచిందని, కానీ గాంధీజీని అవమాన పరుస్తూ, గాడ్సేను పొగిడే సంస్థలను తరిమికొట్టి దేశాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం అలాంటి సంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బావిభారత పౌరులకు సినిమా థియేటర్లలో దేశభక్తిని పెంపొందించేలా స్వాతంత్య్ర సమరయోధులు చిత్రాలను ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకల్లో ప్రతీ పౌరుడు స్వచ్ఛందంగా పాల్గొనాలని హరీశ్రావు పిలుపునిచ్చారు.