జహీరాబాద్ మీదుగా బుల్లెట్ ట్రెయిన్ నడిపించాలి
ABN , First Publish Date - 2022-03-17T05:02:30+05:30 IST
కేంద్ర రైల్వే శాఖ ముంబై, హైదరాబాద్ మధ్య ప్రతిపాదించిన బుల్లెట్ ట్రెయిన్ను వికారాబాద్, జహీరాబాద్ మీదుగా నడిపించాలని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ కోరారు.
పార్లమెంట్లో ప్రస్తావించిన ఎంపీ బీబీ పాటిల్
జహీరాబాద్, మార్చి 16: కేంద్ర రైల్వే శాఖ ముంబై, హైదరాబాద్ మధ్య ప్రతిపాదించిన బుల్లెట్ ట్రెయిన్ను వికారాబాద్, జహీరాబాద్ మీదుగా నడిపించాలని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ కోరారు. బుధవారం పార్లమెంట్ సమావేశంలో ఎంపీ మాట్లాడారు. జహీరాబాద్ ప్రాంతంలో నిమ్జ్ ప్రాజెక్టు ఏర్పాటు కానుండడంతో పాటు జహీరాబాద్ ప్రాంతంలో మహేంద్ర అండ్ మహేంద్ర పరిశ్రమతో పాటు పిరమల్, అల్లనా లాంటి పెద్దపెద్ద పరిశ్రమలు ఉన్నందున ఇక్కడి ప్రజలు, ఉద్యోగుల సౌకర్యార్థం బుల్లెట్ ట్రెయిన్ నడిపిస్తే సౌకర్యవంతంగా ఉంటుందని పేర్కొన్నారు. జహీరాబాద్ మీదుగా ముంబైకి 65వ జాతీయ రహదారి ఉండడం, కర్ణాటకలోని బీదర్లో కార్గో విమానాశ్రయం ఉన్నందున మెరుగైన రవాణా సౌకర్యం ఉండాలంటే ఈ ప్రాంతాలకు బుల్లెట్ ట్రెయిన్ సౌకర్యం ఏర్పాటు చేస్తే బాగుంటుందని బీబీ పాటిల్ సభలో తెలిపారు. అలాగే జహీరాబాద్ నియోజకవర్గంలోని కోహీర్ వద్ద గల 25వ రైల్వేగేట్ వద్ద రైల్వే వంతెనను నిర్మించాలని ఎంపీ పేర్కొన్నారు.