బీజేపీ నాయకుల జోలికొస్తే సహించం

ABN , First Publish Date - 2022-06-23T04:58:46+05:30 IST

బీజేపీ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నరేందర్‌రెడ్ది హెచ్చరించారు.

బీజేపీ నాయకుల జోలికొస్తే సహించం
సంగారెడ్డిలోని బీజేపీ కార్యాలయంలో మాట్లాడుతున్న పార్టీ జిల్లా అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి

పాస్‌పోర్టు కేసులో జైలు కెళ్లిన చరిత్ర జగ్గారెడ్డిది 

బీజేపీ జిల్లా అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి

సంగారెడ్డి రూరల్‌, జూన్‌ 22: బీజేపీ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నరేందర్‌రెడ్ది హెచ్చరించారు. సంగారెడ్డిలోని బీజేపీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఊసరవెళ్లిలా పార్టీలు మారుతూ గెలిపించిన ప్రజల కష్టసుఖాలను తెలుసుకోకుండా హైదరాబాద్‌లో ఉంటూ రాజభోగాలు అనుభవిస్తున్నారని విమర్శించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, మాణిక్కం ఠాకూర్‌ వద్ద తన ఇమేజ్‌ను పెంచుకునేందుకు ఎంతో క్రమశిక్షణ గల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిపై అవాకులు చవాకులు మాట్లాడడం విడ్డూరమని, అగ్నిపథ్‌ పథకంపై వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. ఎమ్మెల్యేగా గిలిచి మూడున్నరేళ్లలో చేసిన అభివృద్ధి పనులపై శ్వేత పత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. పాస్‌పోర్టు కేసులో జైలుకెళ్లి వచ్చిన చరిత్ర నీదని నరేందర్‌రెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి ప్రజలకే కాదు సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలకు అందుబాటులో ఉండడం లేదన్నారు. సమావేశంలో సంగారెడ్డి నియోజకవర్గ ఇన్‌చార్జి రాజేశ్వర్‌రావు దేశ్‌పాండే, నాయకులు చంద్రశేఖర్‌, హరిశంకర్‌, నర్సారెడ్డి, శంకర్‌, విష్ణువర్దన్‌రెడ్డి పాల్గొన్నారు.



Updated Date - 2022-06-23T04:58:46+05:30 IST