రమణీయం..హనుమాన్ తెప్పోత్సవం
ABN , First Publish Date - 2022-05-18T05:12:05+05:30 IST
కోమటిచెరువుపై రాత్రి హనుమాన్ తెప్పోత్సవాన్ని కన్నులపండుగగా నిర్వహించారు. అఖిల భారత హనుమత్ దీక్షాపీఠం పీఠాధిపతి, హనుమాన్ దీక్ష మాల రూపకర్త దుర్గాప్రసాద్స్వామి ఆధ్వర్యంలో వైభవోపేతంగా నిర్వహించారు.
సిద్దిపేట కల్చరల్, మే 17 : కోమటిచెరువుపై రాత్రి హనుమాన్ తెప్పోత్సవాన్ని కన్నులపండుగగా నిర్వహించారు. అఖిల భారత హనుమత్ దీక్షాపీఠం పీఠాధిపతి, హనుమాన్ దీక్ష మాల రూపకర్త దుర్గాప్రసాద్స్వామి ఆధ్వర్యంలో వైభవోపేతంగా నిర్వహించారు. ముందుగా రావిచెట్టు హనుమాన్ ఆలయం నుంచి కోమటిచెరువు వరకు రథయాత్రను అంగరంగవైభవంగా కొనసాగింది. హనుమాన్ దీక్షా స్వాములు, భక్తులు పెద్దఎత్తున పాల్గొని ఈ ఊరేగింపును దిగ్విజయం చేశారు. రథంపై తీసుకొచ్చిన హనుమాన్ విగ్రహాన్ని కోమటిచెరువుపై ప్రత్యేకంగా అలంకరించిన పడవలోకి చేర్చి విశేష పూజలు చేశారు. తెప్పోత్సవంలో పాల్గొన్న మంత్రి హరీశ్రావు శ్రీరామ పాదుకలను తలపై పెట్టుకొని తీసుకువచ్చారు.
వచ్చే ఏడాది రంగనాయకసాగర్లో నిర్వహించుకుందాం : మంత్రి హరీశ్రావు
హనుమాన్ తెప్పోత్సవాన్ని సిద్దిపేటలో నిర్వహించడం ఇక్కడి ప్రజల అదృష్టమని మంత్రి హరీశ్రావు ఆనందం వ్యక్తం చేశారు. సిద్దిపేటలో 30 ఏళ్ల క్రితం ఐదుగురితో మాలధారణ ప్రారంభమై వేలాదిమంది భక్తులుగా మారడం శుభపరిణామని అన్నారు. విజయవాడలో తెప్పోత్సవం జరుగుతుందని విన్నానని, సిద్దిపేటలోనూ నిర్వహించడం సంతోషకరమన్నారు. ఇక ప్రతీ ఏటా తెప్పోత్సవాన్ని జరుపుకుందామని, వచ్చే ఏడాది రంగనాయకసాగర్లో నిర్వహించుకుందామని మంత్రి చెప్పారు. కండ్లకోయలో మాల విరమణకు దుర్గాప్రసాద్ స్వామివారు అనుగ్రహం ఇవ్వడం సంతోషకరమైన విషయమన్నారు. ప్రజలందరికీ హనుమంతుడి కృప ఉండాలని ఆ స్వామిని వేడుకున్నట్లు చెప్పారు. ఉదయం స్థానిక రావిచెట్టు హనుమాన్ ఆలయంలో మంత్రి హరీశ్రావు ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం హనుమాన్ ఆశ్రమ పీఠాధిపతి దుర్గాప్రసాద్ స్వామీజీ ఆశీర్వచనం స్వీకరించారు. ఈ సందర్భంగా హనుమాన్ దీక్ష స్వాములతో కలిసి భిక్ష చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీరామరాజు హనుమాన్ చారిటబుల్ ట్రస్ట్, అఖిల భారత హనుమాన్ దీక్ష సేవా సమితి ప్రతినిధులు, హనుమాన్ దీక్ష స్వాములు పాల్గొన్నారు.