గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌లో పెండింగ్‌ పనులన్నీ పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2022-10-08T04:36:32+05:30 IST

గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ మున్సిపాలిటీలో పెండింగ్‌లో ఉన్న పనులన్నీ పూర్తి చేయాలని డిమాండ్‌ చేస్తూ మున్సిపల్‌ కార్యాలయం ఎదుట బీజేపీ నాయకులు నిరసన తెలిపారు.

గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌లో పెండింగ్‌ పనులన్నీ పూర్తి చేయాలి
గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ మున్సిపల్‌ కార్యాలయం ఎదుట నిరసన తెలుపుతున్న బీజేపీ నాయకులు

గజ్వేల్‌పై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్న మంత్రి హరీశ్‌రావు

మున్సిపల్‌ ఎదుట నిరసన తెలిపిన  బీజేపీ నాయకులు

గజ్వేల్‌, అక్టోబరు 7: గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ మున్సిపాలిటీలో పెండింగ్‌లో ఉన్న పనులన్నీ పూర్తి చేయాలని డిమాండ్‌ చేస్తూ మున్సిపల్‌ కార్యాలయం ఎదుట బీజేపీ నాయకులు నిరసన తెలిపారు. గజ్వేల్‌లోని మున్సిపల్‌ కార్యాలయం ఎదటు ధర్నా నిర్వహించిన బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు మనోహర్‌యాదవ్‌ మాట్లాడుతూ... సీఎం కేసీఆర్‌ గెలిచి ఎనిమిదేళ్లవుతుందని, గజ్వేల్‌కు హామీ ఇచ్చిన పనులు మొదలుపెట్టిన ప్రభుత్వం ఇంకా పూర్తిచేయడంలో నిర్లక్ష్య వైఖరిని అవలంభిస్తుందన్నారు. బస్టాండ్‌ను కూలదోసి విద్యార్థులను, వ్యాపారులను ఇబ్బందులు పెడుతున్నారని, సిద్దిపేటలో బస్టాండ్‌ మూడు నెలల్లో పూర్తయిందని, కానీ గజ్వేల్‌లో మూడేళ్లు దాటినా పూర్తికావడం లేదన్నారు. రూ.99 కోట్ల వ్యయంతో చేపట్టిన యూజీడీ పనులు పూర్తికావడం లేదని, ఇందిరాపార్కు-కోటమైసమ్మ రోడ్డు విస్తరణ పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతుందన్నారు. మంత్రి హరీశ్‌రావు గజ్వేల్‌పై సవతి తల్లి ప్రేమ చూపిస్తూ అభివృద్ధిని అడ్డుకుంటున్నారన్నారు. కాంట్రాక్టర్లను, అధికారులను ఒత్తిడికి గురిచేస్తున్నారని ఆరోపించారు. కలెక్టర్‌ పనులను పరిశీలించి నెలలు గడుస్తున్నా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా పరిస్థితి ఉందన్నారు. గజ్వేల్‌ టీఆర్‌ఎస్‌ నాయకులు పనులను పూర్తి చేయడంలో విఫలమవుతున్నారన్నారు. ధర్నాలో పట్టణాధ్యక్షుడు ఆర్కేయాదవ్‌, బీజేపీ జిల్లా కార్యదర్శి కుడిక్యాల రాములు, బీజేవైఎం నాయకులు నేమూరి ఆంజనేయులుగౌడ్‌, బీజేపీ నాయకులు ఎల్కంటి సురేశ్‌, నాయకులు కోదండం శ్రీనివా్‌సరెడ్డి, పంజాల అశోక్‌, తుమ్మ తిరుపతి, వెంకట్రాంరెడ్డి, నత్తి శివకుమార్‌, గుర్రం శ్రీధర్‌, బబ్బూరి రవీందర్‌గౌడ్‌, ఢిల్లీ నవీన్‌, హరికృష్ణ, శ్రీకాంత్‌గౌడ్‌, అనిల్‌ తదితరులున్నారు.

Updated Date - 2022-10-08T04:36:32+05:30 IST