కారు బోల్తా పడి యువకుడి మృతి

ABN , First Publish Date - 2022-09-11T04:38:52+05:30 IST

కారుబోల్తా పడి ఓ యువకుడు మృతి చెందిన సంఘటన శనివారం తెల్లవారుజామున మండలంలోని జుల్‌కల్‌ వద్ద చోటు చేసుకున్నది.

కారు బోల్తా పడి యువకుడి మృతి
కంది మండల పరిధిలోని శివారులో ఘటనాస్థలంలో మృతి చెందిన ఖాదిర్‌

కంది, సెప్టెంబరు 10: కారుబోల్తా పడి ఓ యువకుడు మృతి చెందిన సంఘటన శనివారం తెల్లవారుజామున మండలంలోని జుల్‌కల్‌ వద్ద చోటు చేసుకున్నది. ఇంద్రకరణ్‌ ఎస్‌ఐ రాజేశ్‌ నాయక్‌ తెలిపిన వివరాల ప్రకారం.. కందిలోని లక్ష్మీనగర్‌ కాలనీకి చెందిన ఎండీ ఖాదిర్‌(25), అతడి స్నేహితులు ఆబేద్‌, జావేద్‌ శుక్రవారం అర్థరాత్రి దాటేదాక కాలనీలో గణేష్‌ నిమజ్జన కార్యక్రమంలో డ్యాన్సులు చేశారు. ఆ తర్వాత కంది-ఖంకర్‌పల్లి రోడ్డులో శనివారం తెల్లవారు జామున 4 గంటల వరకు కారులో షికార్లు కొట్టారు. ఈ క్రమంలో మండలంలోని జుల్‌కల్‌ శివారులో మూలమలుపు వద్ద యూటర్న్‌ తీసుకుంటుండగా కారు అదుపుతప్పి పల్టీలు కొడుతూ పక్కనే పత్తిచేనులో బోల్తాపడింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన ఖాదిర్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సమాచారమందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఖాదిర్‌ మృతదేహాన్ని పోస్టు మార్టమ్‌ నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అతడి స్నేహితులకు స్వల్ప గాయాలు కాగా వారిని కూడా చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లారు. మృతుడి అన్న ఎండీ సర్వర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.  

Updated Date - 2022-09-11T04:38:52+05:30 IST