మూడున మెగా జాబ్ మేళా
ABN , First Publish Date - 2022-06-30T05:05:24+05:30 IST
వచ్చేనెల మూడవ తేదీన జిల్లా పరిషత్ మైదానంలో నిర్వహించనున్న మెగా జాబ్ మేళాకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఎస్. వెంకట్రావు అధికారులను ఆదేశించారు.
- పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్ వెంకట్రావు
మహబూబ్ నగర్ (కలెక్టరేట్), జూన్ 29 : వచ్చేనెల మూడవ తేదీన జిల్లా పరిషత్ మైదానంలో నిర్వహించనున్న మెగా జాబ్ మేళాకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఎస్. వెంకట్రావు అధికారులను ఆదేశించారు. జాబ్ మేళా ఏర్పాట్లపై బుధవారం ఆయన తన చాంబర్లో సంబంధిత అధికారులతో సమీక్షించారు. జాబ్ మేళాపై రూపొందించిన గోడ పత్రికను ఆవిష్కరించారు. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ జూలై 3 న ఉదయం తొమ్మిది గంటలకు జాబ్ మేళాను ప్రారంభిస్తారని, సుమారు 60 కంపేనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొంటున్నాయని తెలిపారు. ఏడో తరగతి నుంచి మొదలుకొని బీటెక్, బీ-ఫార్మసీ, ఎం ఫార్మసీ, హోటల్ మ్యానెజ్మెంట్ తదితర కోర్సులు చేసిన వారికి కూడా జాబ్ మేళాలో ఉద్యోగాలు పొందేందుకు అవకాశం ఉందని తెలిపారు. సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశిం చారు. జిల్లా క్రీడలు, యువజన సర్వీసుల శాఖ అధికారి శ్రీనివాస్, ట్రూ కన్సల్టెన్సి ఎండీ మన్మోహన్ ఈ సమావేశానికి హాజరయ్యారు.
గణాంక దర్శినిలో జిల్లా సమాచారం
జిల్లాకు సంబంధించిన సమస్త సమాచారాన్ని జిల్లా గణాంకదర్శిని ద్వారా తెలుసుకోవచ్చని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావు అన్నారు. 16వ జాతీయ గణాంక దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం ఆయన కలెక్టర్ కార్యాలయంలో 2020-21 సంవత్సరానికి సంబంధించి ముఖ్య ప్రణాళిక అధికారి కార్యాలయం ద్వారా రూపొందించిన మహబూబ్నగర్ జిల్లా గణాంకదర్శినిని ఆయన ఆవిష్కరించారు. జిల్లా భౌగోలిక స్వరూపం, రెవెన్యూ, భూములు, వ్యవసాయం, విద్య, వైద్యం, ఆరోగ్యం, సంక్షేమం తదితర అన్ని అంశాలతో జిల్లా గణాంకదర్శిణిని రోపొందించినట్లు తెలిపారు. ఎన్నో వ్యయ ప్రయాసాలకోర్చి జిల్లా గణాంకాదర్శినిని రూపొందించిన ముఖ్య ప్రణాళిక అధికారి దశరథంతో పాటు, సిబ్బందిని ఆయన అభినందించారు. సీపీవో దశరథం కార్యక్రమంలో పాల్గొన్నారు.