రైతులపై కేంద్రం వైఖరి సరికాదు
ABN , First Publish Date - 2022-01-20T05:18:51+05:30 IST
రైతుల విషయంలో కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలు సరైనవి కాదని మాజీ ఎంపీ మందా జగన్నాథ్ విమర్శించారు.
- సీఎం కేసీఆర్ పాలనలో తగ్గిన వలసలు
- మాజీ ఎంపీ మందా జగన్నాథ్
ఉండవల్లి, జనవరి 19 : రైతుల విషయంలో కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలు సరైనవి కాదని మాజీ ఎంపీ మందా జగన్నాథ్ విమర్శించారు. మండల పరిదిలోని శేరుపల్లి గ్రామంలో కొనసాగుతున్న ఈదమ్మ దేవర ఉత్సవాలకు బుధవారం ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకుడు మనోహర్ రెడ్డి ఇంటి వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో పాలమూర్ జిల్లా వలసలకు కేరాఫ్గా ఉండేదని, ముఖ్య మంత్రి కేసీఆర్ పాలనలో అదే పాలమూర్ జిల్లా ఇతర రాష్ట్రాల కూలీలకు కూడా ఉపాధి కల్పిస్తోందని అన్నారు. సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమం కోరుకుంటుంటే, కేంద్ర ప్రభుత్వం ఎరువుల ధరలను భారీగా పెంచి రైతుల నడ్డి విరుస్తోందని మండిపడ్డారు. రాబోవు రోజుల్లో దేశ రాజకీయాల్లో కేసీఆర్ కీలక పాత్ర పోషించనున్నారని చెప్పారు. సమావేశంలో సీనియర్ నాయకులు వడ్డేపల్లి శ్రీనివాసులు, పల్లెపాడు శంకర్రెడ్డి, సర్పంచు ఆత్మలింగారెడ్డి, గిడ్డారెడ్డి, ఏకాంత్, శ్రీకాంత్గౌడు పాల్గొన్నారు.