పాలమూరు అతలాకుతలం
ABN , First Publish Date - 2022-10-13T04:29:45+05:30 IST
వర్ష భీభత్సం పాలమూరును అతలాకుతలం చేస్తోంది. పదిహేను రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు లోతట్టు కాల నీల ప్రజలను కంటిమీద కునుకులేకుండా చేస్తున్నా యి.
కుండపోత వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయం
పొంగిన నాలాలు.. ఇళ్లలోకి చేరిన నీరు..
కరెంట్ లేకపోవడంతో జనం బెంబేలు
మహబూబ్నగర్, అక్టోబరు 12: వర్ష భీభత్సం పాలమూరును అతలాకుతలం చేస్తోంది. పదిహేను రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు లోతట్టు కాల నీల ప్రజలను కంటిమీద కునుకులేకుండా చేస్తున్నా యి. బుధవారం రాత్రి గంటకుపైగా కురిసిన వర్షానికి వరద పోటెత్తింది. ఎనిమిది సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. పాలమూరు పట్టణానికి ఎగు వన ఉన్న చెరువులన్నీ అలుగులు పారుతుండటంతో వరద తీవ్రత మరింత పెరిగింది. దాంతో పట్టణంలోని నాలాలు నీటి ప్రవాహాన్ని తట్టుకోలేక పొంగి ప్రవహిస్తున్నాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో చీకట్లో జనం బెంబేలెత్తారు. సుభాష్నగర్, న్యూటౌన్, లక్ష్మీనగర్ కాలనీ, బాయమ్మతోట, సద్దలగుండు ప్రాంతాల్లోకి నీరు చేరింది. శ్రీకృష్ణ థియేటర్ పక్కన ఉన్న నాలా ఎక్కి పారడంతో టాకీస్లోకి నీరు చేరింది. ఇళ్ళముందు ఆపిన వాహనాలు నీటమునిగాయి. ప్రధాన రహదారిపై పలు వ్యాపార వాణిజ్య సముదాయాల్లోకి నీరు చేరింది. న్యూటౌన్ పంచవటి హోటల్లోకి నీరు చేరింది. ఇక పెద్ద చెరువు దిగువన ఉన్న బీకెరెడ్డి కాలనీ, రామయ్యబౌళి, శివశక్తినగర్, మహేశ్వరినగర్ కాలనీల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఇళ్ల ముందు మోకళ్ళలోతుకుపైగా వరద ప్రవహిస్తుండటంతో పలు ఇళ్లలోకి నీరు చేరింది. ఇంట్లో ఉన్న వస్తువులు పాడవ కుండా జనం తంటాలు పడాల్సి వచ్చింది. వరద ఉదృతికి బీకేరెడ్డి కాలనీలోని ఓ ఇంటి ప్రహరీ కూలి పోయి, ఇంట్లోకి నీరు చేరింది. ఇక్కడ ఇళ్లలోకి నీళ్లు రావడంతో కొందరు వరదలోనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు. రామయ్యబౌళి, శివశక్తినగర్ కాలనీలకు ఇదివరకు కంటే వరద అధికంగా రావడంతో చాలా ఇళ్లలోకి నీరు చేరింది. ఇక ఎర్రకుంటకు కూడా భారీ గా వరద పోటెత్తడంతో దిగువ కాలనీలకు భారీగా వరద ప్రవహించింది. గణేష్నగర్లోని పలు ఇళ్లకు నీరు చేరింది. రాయచూర్ ప్రధాన రహదారిపైకి భారీగా నీరు రావడంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. కురిహిణిశెట్టి కాలనీలోని ఇండ్లు ఇప్పటికే నీటిలో ఉండగా, ఈ రోజు కురిసిన భారీ వర్షానికి ఇళ్లన్నీ నీట మునిగాయి. రాత్రి వేళ వర్షం కురవడంతో జనాలు ఆందోళన చెందుతున్నారు. భగీరథ కాలనీ సమీ పంలోని భూత్పూర్-మహబూబ్నగర్ ప్రధాన రహదా రిపై విద్యుత్ పోల్ ఒరగడంతో ట్రాఫిక్కు అంత రాయం కలిగింది. విద్యుత్ అధికారులు స్తంభాన్ని పునరుద్ధరించి ట్రాఫిక్ను క్లియర్ చేశారు. కలెక్టర్ వెంకట్రావు, అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, మునిసిపల్ చైర్మన్ కోరమోని నర్సింహులు, కమిషనర్ ప్రదీప్కుమార్, కౌన్సిలర్లు లోతట్టు ప్రాంతాలను సందర్శించి, పరిస్థితిని పరిశీలించారు. మునిసిపల్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు.
పెద్ద చెరువులోకి నీటిని మళ్లించండి: మంత్రి
మహబూబ్నగర్: మహ బూబ్నగర్లోని పెద్ద చెరువు అభివృద్ధి పను ల కారణంగా వరద నీరు చెరువులోకి వెళ్ల కుండా కాలువల ద్వారా డైవర్షన్ చేశారు. అయితే భారీ వర్షాల కారణంగా పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురవుతుండటంతో మళ్లీ పెద్ద చెరువులోకి నీరు వదలాలని రాష్ట్ర ఎక్సైజ్శాఖ మంత్రి వి.శ్రీనివాస్గౌడ్ కలెక్టర్ ఎస్ వెంకట్రావ్ను బుధవారం ఆదేశించారు. మునుగోడు ఎన్నికల ప్రచారంలో ఉన్న మంత్రి ఫోన్లో అధికారులతో మాట్లాడారు. భారీగా కురుస్తున్న వర్షాల వల్ల ఎగువ నుంచి వరద పెద్ద ఎత్తున వచ్చి లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి. దాంతో వారికి ఇబ్బందులు లేకుండా డైవర్షన్ కాలువలు తెంపి మళ్ళీ చెరువులోకి నీటిని వదలాలని సూచించారు. పెద్ద చెరువు కింద 40 ఏళ్లుగా వ్యవసాయం లేకపోవడంతో తూము పూర్తిగా పాడైందని చెప్పారు. ప్రస్తుతం దానిని పునరుద్ధరించినందున చెరువులోకి నీరు వదిలి తూము, రెండు వైపుల అలుగుల ద్వారా నీటిని వదలాలని పేర్కొన్నారు. తూము పనులు 70 శాతం పూర్తయ్యాయని, చెరువు నిండాలంటే రెండు రోజులు సమయం పడుతుందని, ఆలోగా మిగిలిన తూము, కాలువ పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. రామయ్యబౌళి వైపు వాహనాలు తిరగడానికి కట్టను తెంపడం జరిగిందని, ఈ కట్టను మళ్లీ పునరిద్ధరిస్తామన్నారు. లోతట్టు ప్రాంత ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఎంత ఖర్చు చేసైనా శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు.