దక్షిణ కాశీకి కార్తీక శోభ
ABN , First Publish Date - 2022-11-22T23:24:38+05:30 IST
కార్తీకమాసం చివరి రోజు మంగళవారం అలంపూరు పుణ్యక్షేత్రం భక్తులతో కిక్కిరిసిపోయింది. నవబ్రహ్మ ఆలయాలు, జోగుళాంబ అమ్మవారి దర్శనానికి తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, నుంచి వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
- కార్తీక మాసం చివరి మంగళవారం అలంపూర్ క్షేత్రానికి పోటెత్తిన భక్తులు
అలంపూరు, నవంబరు 22 : కార్తీకమాసం చివరి రోజు మంగళవారం అలంపూరు పుణ్యక్షేత్రం భక్తులతో కిక్కిరిసిపోయింది. నవబ్రహ్మ ఆలయాలు, జోగుళాంబ అమ్మవారి దర్శనానికి తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, నుంచి వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. తుంగభద్ర నదిలో పుణ్యస్నానం ఆచరించి కార్తీక దీపాలను వదిలారు. స్వామి, అమ్మవార్ల దర్శనానికి భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. స్వామి వారికి అభిషేకాలు, జోగుళాంబ అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించారు. నిమ్మకాయల మాలలు, ఒడి బియ్యం, చీరలు సమర్పించారు. అలాగే జములమ్మ ఆలయంలోనూ భక్తులు కుంకుమార్చన చేసి, నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.
పూర్ణ లింగేశ్వర స్వామికి అభిషేకం
గద్వాల : పట్టణ సమీపంలోని నదీ అగ్రహారం వద్ద కృష్ణానది మధ్యలో ఉన్న పూర్ణ లింగేశ్వర స్వామికి మంగళవారం ఎమ్మెల్యే సతీమణి, బూరెడ్డిపల్లి సర్పంచు బండ్ల జ్యోతి అభిషేకం చేశారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. నదీ తీరంలో మహిళలు దీపాలు వెలిగించి పూజలు చేశారు.