రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు మృతి

ABN , First Publish Date - 2022-07-02T05:17:48+05:30 IST

బైక్‌పై ఆస్పత్రికి వెళ్ళి తిరిగి వస్తున్న భార్యాభర్తలను కారు ఢీకొట్టడంతో వారు అక్కడికక్కడే దుర్మణం చెందారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా బిజినేపల్లి మండలం కొట్టాల్‌గడ్డ గ్రామ సమీపంలో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం..

రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు మృతి
తల్లి శవం వద్ద రోదిస్తున్న కుమారుడు

నాగర్‌కర్నూల్‌ జిల్లా కొట్టాల్‌గడ్డ వద్ద ఘటన

బైక్‌ను ఢీకొన్న కారు


బిజినేపల్లి, జూలై 1: బైక్‌పై ఆస్పత్రికి వెళ్ళి తిరిగి వస్తున్న భార్యాభర్తలను  కారు ఢీకొట్టడంతో వారు అక్కడికక్కడే దుర్మణం చెందారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా బిజినేపల్లి మండలం కొట్టాల్‌గడ్డ గ్రామ సమీపంలో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. కొట్టాల్‌గడ్డ గ్రామానికి చెందిన బచ్చలకూర పరశురాములు(34), సునిత(30) భార్యా భర్తలు. పరుశరాములు అన్న కూతురు కల్పన నాలుగు నెలల గర్భిణి. కల్పనకు నెలవారీ చెకప్‌లో భాగంగా పక్కనే ఉన్న పాలెం ప్రభుత్వ ఆస్పత్రికి పరశురాములు, సునిత బైక్‌పై తీసుకెళ్లారు. రాత్రి 8:20కి ఆస్పత్రి నుంచి తిరుగు ప్రయాణం అయ్యారు. ఊరికి వచ్చాక రోడ్డు నుంచి ఊర్లోకి మళ్లుతుంటే బిజినేపల్లి వైపు వెళ్తున్న కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ప్రమాదంలో పరుశరాములు, సునిత అక్కడికక్కడే మృతి చెందారు. కల్పనకు తీవ్ర గాయాలు కావడంతో 108 అంబులెన్స్‌లో జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. పరశురాములు, సునితలకు ఒక కూతురు, కుమారుడు ఉన్నారు. ఘటనా స్థలంలో కుమారుడు రోదించడం పలువురిని కలిచి వేసింది.


బైక్‌ డీసీఎం ఢీకొని మరొకరు..

మరికల్‌: బైక్‌, డీసీఎం ఢీకొన్న ప్రమాదంలో మండలంలోని పెద్దచింతకుంట గ్రామానికి చెందిన అనిల్‌(20) మృతి చెందాడు. మరికల్‌ శివారులో శుక్రవారం చోటు చేసుకుంది. పెద్దచింతకుంటకు చెందిన శ్రీశైలం, అతని కూమారులు అనిల్‌, మల్లేష్‌ బైక్‌పై మరికల్‌ నుంచి స్వగ్రామానికి వెళ్తున్నారు. మరికల్‌ వద్ద ఎదురుగా వస్తున్న డీసీఎం బైక్‌ను ఢీకొనడంతో వెనుక కూర్చున్న అనిల్‌(20) అక్కడికక్కడే మృతి చెందాడు. శ్రీశైలం, మల్లేష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వారిని 108 అంబులెన్స్‌లో మహబూబ్‌నగర్‌ ఆస్పత్రికి తరలించారు. అనిల్‌ శవాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.

Updated Date - 2022-07-02T05:17:48+05:30 IST