పేదల ఇళ్ల పట్టాలను లాక్కుంటారా?
ABN , First Publish Date - 2022-03-17T04:47:02+05:30 IST
గత పాలకులు వివక్షత చూపిస్తున్నారని తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటే మీ అవసరాల కోసం ఉమ్మడి పాలనలో పేదలకు ఇచ్చిన ఇళ్ల పట్టాలను లాక్కుంటారా? ఇందు కోసమేనా తెలంగాణను సాధించుకున్నదని సీపీఐఎంఎల్ ప్రజాపంథా జిల్లా కార్యదర్శి బి.రాము ప్రశ్నించారు.
- పట్టాలు ఇచ్చిన స్థలంలోనే డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇవ్వాలి
- నోటీసులను వెనక్కి తీసుకోవాలి
- సీపీఐఎంఎల్ ప్రజాపంథా జిల్లా కార్యదర్శి రాము
- తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా
ఊట్కూర్, మార్చి 16 : గత పాలకులు వివక్షత చూపిస్తున్నారని తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటే మీ అవసరాల కోసం ఉమ్మడి పాలనలో పేదలకు ఇచ్చిన ఇళ్ల పట్టాలను లాక్కుంటారా? ఇందు కోసమేనా తెలంగాణను సాధించుకున్నదని సీపీఐఎంఎల్ ప్రజాపంథా జిల్లా కార్యదర్శి బి.రాము ప్రశ్నించారు. నారాయణపేట పట్టణానికి అనుకొని ఉన్న ఊట్కూర్ మండలం వల్లంపల్లి గ్రామ శివారులోని సర్వే నెంబర్ 62లో 1998లో కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలం ఎందుకు వెనక్కి తీసుకుంటున్నారో చెప్పాలని ఊట్కూర్ తహసీల్దార్ కార్యాలయం ముందు 350మంది లబ్ధిదారులు ప్రజాపంథా ఆధ్వర్యంలో బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నారాయణపేట మునిసిపాలిటీలో నివాసం ఉంటున్న పేదలకు గతంలో ఇండ్ల నిర్మాణానికి పట్టాలు ఇచ్చిన స్థలంలోనే ప్రభుత్వం డబుల్ బెడ్రూం నిర్మాణం చేసి ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హాయంలో చిట్టెం నర్సిరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇంటి స్థలంతో పాటు ఇందిరమ్మ ఇండ్లు కూడా మంజూరు చేశారని తెలిపారు. తమకు సొంత ఇండ్లు వస్తాయని లబ్ధిదారులు అప్పులు చేసి తమ వాటా డబ్బులు చెల్లించినా ప్రభుత్వం ఇండ్లు నిర్మించి ఇవ్వలేదని వివరించారు. కాంట్రాక్టర్ కొన్ని ఇండ్లకు పునాదులు వేయగా, కొందరికి గోడలు కట్టి వదిలి వేశారని తెలిపారు. అయినా స్థలమైనా ఉందని భావిస్తే 22 సంవత్సరాల తర్వాత ఇండ్లు నిర్మించుకోలేదు కాబట్టి స్థలం వెనక్కి తీసుకుంటామని తహసీల్దార్ నోటీలు ఇవ్వడం అన్యాయమన్నారు. వెంటనే నోటీసులను వెనక్కి తీసుకుని పట్టాలు ఇచ్చిన చోటే డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతకుముందు డివిజన్ కార్యదర్శి సలీం, పీవైఎల్ రాష్ట్ర అధ్యక్షుడు కాశీనాథ్ మాట్లాడారు. అనంతరం తహసీల్దార్ తిరుపతయ్యకు వినతి పత్రం ఇచ్చారు. అంతకుముందు తహసీల్దార్ తిరుపతయ్యకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా తహ సీల్దార్ మాట్లాడుతూ అసైండ్మెంట్ యాక్టు ప్రకారం స్థలం ఇచ్చిన ఆరు నెలల్లో ఇంటి నిర్మాణం చేసుకోవాలి. నిర్మించుకోనందుకే కలెక్టర్ ఆదేశాల మేరకు నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. మీరు ఇచ్చిన వినతిపత్రాన్నిపై అధికారులకు పంపించి వారి ఆదేశానుసారం నిర్ణయం తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి యాదగిరి, ఉపాధ్యక్షుడు చెన్నారెడ్డి, హాజీమాలన్, ప్రజా పంథా నారాయణపేట పట్టణ నాయకులు కెంచె నారాయణ, పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు సాయికుమార్, పీవైఎల్ నాయకులు శేఖర్, లబ్ధిదారులు యంకుబాయి, సత్యవిజయ్, మైనోద్దీన్, సాదిక్, సలీం, ఎండీ .తాహేర్, గులాం రసూల్, ఎండీ.జలీల్ పాల్గొన్నారు.