ఇటు కేసీఆర్.. అటు గవర్నర్
ABN , First Publish Date - 2022-07-18T07:16:08+05:30 IST
ఇటు కేసీఆర్.. అటు గవర్నర్
భద్రాద్రి జిల్లాలో పోటాపోటీ పర్యటన
ఖమ్మం (ఆంధ్రజ్యోతి ప్రతినిధి)/ భద్రాచలం/కొత్తగూ డెం, జూలై 17: గోదావరి వరదల నేపథ్యంలో సీఎం కేసీఆర్,గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆదివారం భద్రాద్రి జిల్లాలో పోటాపోటీ పర్యటన నిర్వహించారు. భద్రాచలంలో కేసీఆర్, అశ్వాపురంలో గవర్నర్ తమిళిసై వేర్వేరుగా పర్యటించి.. భయంవద్దు తామున్నామంటూ వరద బాధితులకు భరోసానిచ్చారు. వరదల కారణంగా భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల, పినపాక, మణుగూరు, అశ్వాపురం, బూర్గంపాడు మండలాల్లో 114 ముంపు గ్రామాలకు చెందిన 7,456 కుటుంబాలకు చెందిన 27,778 మంది వరద బాధితులు 79 పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్నారు. ఈ క్రమంలో వారి బాగోగులను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు సీఎం భద్రాచలం రావడంతో పాటు భద్రాచలానికి శాశ్వత వరద నివారణకు హామీఇచ్చారు. అలాగే గవర్నర్ తమిళిసై అశ్వాపురం మండలంలో వరద బాధితులను పరామర్శించి, వరద నష్టంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదిక అందిస్తానన్నారు. ఇలా ఒకే రోజు సీఎం, గవర్నరు పర్యటనకు రావడం చర్చనీయాంశమైంది.