క్రీడా ప్రాంగణాలను పూర్తి చేయాలి
ABN , First Publish Date - 2022-12-07T00:13:25+05:30 IST
గ్రామాల్లో నిర్మిస్తున్న క్రీడా ప్రాంగణాలను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని జడ్పీ సీఈవో విద్యాలత ఆదేశించారు.
జూలూరుపాడు, డిసెంబరు 6: గ్రామాల్లో నిర్మిస్తున్న క్రీడా ప్రాంగణాలను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని జడ్పీ సీఈవో విద్యాలత ఆదేశించారు. మంగళవారం ఆమె మండలంలోని గాంధీనగర్ పంచాయతీని సందర్శించారు. మొక్కల పెంపకానికి సంబంధించి నర్సరీలో చేపడుతున్న పనులను పరిశీలించారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులతో సమావేశాన్ని నిర్వహించారు. క్రీడా ప్రాంగణాల పనుల పురోగతి గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. ఆమె మాట్లాడుతూ ఈ నెల 10వ తేదీ వరకు 24 పంచాయతీల్లో క్రీడా ప్రాంగణాన్ని నిర్మించాలని తెలిపారు. ప్రాంగణాలు పూర్తి చేయకుంటే అధికారులు, పంచాయతీ కార్యదర్శుల పై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. వెంగన్నపాలెం, చింతలతండా, కరివారిగూడెం, కొమ్ముగూడెం, మాచినేనిపేట, మాచినేనిపేటతండా పంచాయతీల్లో క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు రెవెన్యూ సిబ్బంది త్వరితగతిన స్థలాలను అప్పగించాలన్నారు. మండలంలో ఇంకా 13 చోట్ల నిర్మించాల్సి ఉందన్నారు. సమావేశంలో తహసిల్దార్ లూథర్ విల్సన్, ఎంపీడీవో తాళ్లూరి రవి, ఎంపీవో రామారావు పాల్గొన్నారు.