నడి వీధిలో కరకట్ట
ABN , First Publish Date - 2022-01-12T05:16:45+05:30 IST
మణుగూరు మునిసిపాలిటీ పరిధిలోని ప్రధాన రహదారిపై నిర్మిస్తున్న కాల్వ లోపభూ యిష్ఠంగా ఉంది. కాంట్రాక్టర్, అధికారుల నిర్వాకం ఫలితంగా ప్రజలకు ప్రాణసంకటంగా మారనుంది.
కాల్వ నిర్మాణంలో కాంట్రాక్టర్, అధికారుల ఇష్టారాజ్యం ఫలితం
తలాతోకా లేకుండా పనులు
విద్యుత్ స్తంభాలున్నాయంటూ వితండవాదం
నరకం చూస్తున్న మణుగూరు పట్టణ ప్రజలు
ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేసినా ప్రయోజనం శూన్యం
అధికారులకు ఆదేశాలిచ్చా: మునిసిపల్ కమిషనర్
మణుగూరుటౌన్, జనవరి 11: మణుగూరు మునిసిపాలిటీ పరిధిలోని ప్రధాన రహదారిపై నిర్మిస్తున్న కాల్వ లోపభూ యిష్ఠంగా ఉంది. కాంట్రాక్టర్, అధికారుల నిర్వాకం ఫలితంగా ప్రజలకు ప్రాణసంకటంగా మారనుంది. ఇందుకు ఉదాహరణే బంగారు నగల దుకాణాల వీధి నుంచి మొదులుకుని రామాలయం వీధి వేంకటేశ్వరస్వామి గుడి వరకు ప్రధాన రహదారి వెంట నిర్మిస్తున్న ప్రధాన కాల్వ. విద్యుత్ స్తంభాలున్నాయంటూ కాల్వలను ఇష్టారాజ్యంగా వం కరటింకరగా నిర్మించారు. నిబంధనల ప్రకారం అంటూనే కరకట్టను తలపించేలా కాల్వను నిర్మించారు. కాల్వ నిర్మాణ ప నులు ప్రారంభం నుంచి పాదచారులకు, వాహన చోదకులకు ఇబ్బందికరంగాను, ప్రాణసంకటంగాను ఉంటుందని చెబుతున్నా కాంట్రాక్టర్తోపాటు అధికారులు పట్టించుకోకపోగా అసహనం వ్యక్తం చేస్తున్నారు.
నెలరోజులుగా స్తంభించిన రాకపోకలు
మునిసిపల్ అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంతో పాత బయ్యారం బస్టాండ్ సమీపంలోని ప్రధాన రహదారిపై నిర్మించిన కాలువ ప్రజలకు ప్రాణ సంకటంగా మారింది. రామాలయం ఏరియా, గోల్డ్షాప్లైన్ ఏరియా, గాంధీనగర్, లెనిన్నగర్, కాళీమాత ఏరియాకు చెందిన ప్రజలు ఎక్కువ శాతం ఈ రహదారి మీదుగా రాకపోకలు సాగిస్తుంటారు. లోపభూయిష్ఠంగా నిర్మించిన కాల్వతో నెలరోజులుగా ఈ రహదారి మీదుగా రాకపోకలు నిలిచిపోయాయి. కాల్వ పక్కను న్న షాపులకు వినియోగదారులు వెళ్లాలంటే ఎంతో ప్రయాస పడుతున్నారు. ఇటు వ్యాపారాలు సాగక వ్యాపారస్థులు నష్టపోతున్నారు.
ఎమ్మెల్యే రేగా ఆదేశాలు బేఖాతర్
లోపభూయిష్ఠంగా నిర్మించిన ప్రధాన కాల్వను సరిదిద్దాలని చేసిన ఫిర్యాదులను మునిసిపల్ అధికారులు పట్టించుకో కపోవడంతో స్థానికులు ఎమ్మెల్యే రేగా కాంతారావు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆ కాల్వ నిర్మాణ ప్రాంతాన్ని రెండు వారాల క్రితం ఎమ్మెల్యే రేగా సందర్శించారు. మునిసిపల్ అధికారులపై మండిపడ్డారు. రోడ్డు ఉన్న ఎత్తు ఎంత? మీరు నిర్మించిన కాల్వ ఎత్తు ఎంత? అని ప్రశ్నించినట్లు స్థానికులు చెబుతున్నారు. వెంటనే కాల్వను సక్రమంగా నిర్మించాలని ఆదేశాలు జారీ చేసినా అధికారులు పట్టించుకోవడంలేదని స్థానికులు వాపోతున్నారు.
ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశాలిచ్చా: మునిపల్ కమిషనర్ నాగప్రసాద్
పాత బయ్యారం బస్టాండ్ సెంటర్లో ప్రాణసంకటంగా మారిన ప్రధాన కాల్వ నిర్మాణం విషయమై మున్సిపల్ క మిషనర్ దృష్టికి ఆంధ్రజ్యోతి తీసుకుపోగా.. ఈ విషయమై ఎమ్మెల్యే రేగా కాంతారావు కూడా ఫిర్యాదు చేశారని, వెంటనే ఇంజనీరింగ్ అధికారులకు సమస్యను పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశానన్నారు. లేని పక్షంలో తానే స్వయంగా పరిశీలించి చర్యలు తీసుకుంటానన్నారు.