గంగ ఒడికి గణేషుడు
ABN , First Publish Date - 2022-09-11T06:35:00+05:30 IST
గంగ ఒడికి గణేషుడు
ఖమ్మం నగరంలో ఘనంగా శోభాయాత్ర
జోరువానలోనూ యువత ఉత్సాహం
ఇరు జిల్లాల్లో కొనసాగిన నిమజ్జన వేడుకలు
ఖమ్మం(ఆంధ్రజ్యోతి ప్రతినిధి)/భద్రాచలం, సెప్టెంబరు 10: నవరాత్రి ఉత్సవాల్లో విశేష పూజలందుకున్న గణేషుడు శనివారం వైభవంగా గంగ ఒడికి చేరాడు. జోరువానలోనూ గణేష్ నిమజ్జనం ఘనంగా కొనసాగింది. ఇరు జిల్లాల్లో జైగణేషా జైజై గణేషా నినాదాలతో వర్షంలోనూ మేళతాలాళతో గణనాధుడి నిమజ్జన కార్యక్రమం సంబరంగా నిర్వహించారు. మధ్యాహ్నం నుంచి జోరువాన కురుస్తున్నా సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి మండపాలనుంచి వినాయకుడిని కదిలించారు. నిమజ్జన కార్యక్రమానికి ఆటంకం లేకుండా తగిన జాగ్రత్తలతో యువతీ, యువకులు నృత్యాలు చేస్తూ కోలాటాలు వేస్తూ వినయాకుడిని నిమజ్జనానికి తరలించారు. ఖమ్మం నగరంలో వెయ్యికిపైగా విగ్రహాలను మున్నేరుకు నిమజ్జనానికి తరలించారు. సాయంత్రం శోభాయాత్ర కారయక్రమాన్ని రవాణశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ బ్రాహ్మణబజార్లో ప్రారంభించారు. ఖమ్మంలో జరిగిన నిమజ్జన కార్యక్రమంలో మంత్రి పువ్వాడతో పాటు కలెక్టర్ గౌతమ్, సీపీ విష్ణుఎ్సవారియర్, మేయర్ పునుకొల్లు నీరజ పాల్గొన్నారు. జిల్లాలో మధిర సత్తుపల్లి, వైరా, కూసుమంచి, నియోజకవర్గ కేంద్రాల్లోనూగణేష్ నిమజ్జన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయా నియోజకవర్గాల్లోని చెరువులు, ఏర్లలో నిమజ్జన కార్యక్రమం సాగించారు. మున్నేరతోపాటు పలుచోట్ల వాగుల్లో కూడా గణేష్ నిమజ్జనం చేశారు. జిల్లా వ్యాప్తంగా ఐదు వేల విగ్రహాలు నిమజ్జనం చేశారు. కొన్నిచోట్ల లారీలు, మినీవ్యాన్లలో గణపతి విగ్రహాలను భద్రాచలం తీసుకెళ్లి గోదావరిలో నిమజ్జనం చేశారు.
భద్రాచలంలో మూడోరోజూ కొనసాగిన నిమజ్జనాలు
భద్రాచలం వద్ద గోదావరిలో గణేష్ నిమజ్జనం గత 72 గంటలుగా నిరాటంకంగా కొనసాగుతోంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలనుంచి గణేష్ విగ్రహాలను నిమజ్జనానికి తీసుకొస్తున్నారు. గోదావరి ఒడ్డున విగ్రహాల నిమజ్జనం కోసం ఏడు క్రేన్లను, నాలుగు ఎక్స్కవేటర్లను, రెండు లాంచీలను వినియోగిస్తున్నారు. చిన్న విగ్రహాల నిమజ్జనానికి నాటు పడవలను వినియోగిస్తున్నారు. నిమజ్జన కార్యక్రమంలో గజ ఈతగాళ్లు, ఎన్డీఆర్ఎఫ్ బృందం సేవలందిస్తున్నారు.
నేడూ కొనసాగనున్న నిమజ్జనం
భద్రాచలం వద్ద ఆదివారం కూడా గణేష్ నిమజ్జనం కొనసాగనుంది. ఇప్పటివరకు 1,500 విగ్రహాలను గోదావలో నిమజ్జనం చేశారు. నిమజ్జన కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, భద్రాచలం ఏఎ్సపీ రోహితరాజ్, భద్రాద్రి దేవస్థానం ఈవో బి.శివాజీ తదితరులు పర్యవేక్షిస్తున్నారు. భద్రాద్రిలో గణేష్ విగ్రహ నిమజ్జనానికరి వచ్చే భక్తులు నిమజ్జన కార్యక్రమం అనంతరం గోదావరిలో స్నానం ఆచరించి రామయ్యను దర్శించుకుంటున్నారు. ఇందుకోసం దేవస్థానం అధికారులు ప్రత్యేక ఏర్పాటు చేశారు.