సమైక్య సౌరభం
ABN , First Publish Date - 2022-09-17T07:54:17+05:30 IST
సమైక్య సౌరభం
ఇరుజిల్లాల్లో ఘనంగా స్వాతంత్య్ర వజ్రోత్సవ సంబురాలు
నియోజకవర్గ కేంద్రాల్లో అట్టహాసంగా ప్రదర్శనలు
జాతీయజెండాలతో కదం తొక్కిన పౌరులు
ఖమ్మం /కొత్తగూడెం, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతిప్రతినిధి): స్వాతం త్య్ర వజ్రోత్సవవేళ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ సంబురాలు ఉమ్మడిజిల్లాలో శుక్రవారం అట్టహాసంగా జరిగాయి. పది నియోజకర్గ కేంద్రాల్లో ప్రజాప్రతినిధులు, నాయకులు, ఉద్యోగులు, మహిళలు, యువతీ, యువకులు జాతీయ జెండాలతో కదం తొక్కి.. పదం కలిపారు. భారీ ప్రదర్శనలతో రహదారులు సందడిగా మా రాయి. ఖమ్మం జిల్లా కేంద్రంలో కోలాటాలు, గిరిజన సంప్రదాయ కోయ, బంజరా నృత్యాలు, ఆటపాటలతో జడ్పీసెంటర్ నుంచి ఎస్ఆర్అండ్బీజీఎనఆర్ కళాశాల వరకు జరిగిన ర్యాలీని మంత్రి అజయ్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ పోరాటం చరిత్రాత్మకమని, అది ఇప్పటితరాలకు తెలియచేయాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి వర్గానికి సంక్షేమఫలాలు అందజేయాలని, సీఎం కేసీఆర్ ప్రణాళికలు వేస్తుంటే, ఓర్వలేని కొన్నిపార్టీలు అడ్డుపుల్లలు వేస్తూ అసత్య ప్రచారాలు చేస్తున్నాయని విమర్శించారు. కార్యక్రమంలో కలెక్టర్ వీపీ గౌతమ్, సీపీ విష్ణుఎ్సవారియర్, డీసీసీబీ చైర్మన కూరాకుల నాగభూషణం, మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన బచ్చు విజయ్కుమార్, మునిసిపల్ కమిషనర్ ఆదర్శసురభి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 30 కౌంటర్లు ఏర్పాటుచేసి అందరికి భోజన సదుపాయం కలిపించారు.
రాష్ట్రాన్ని కబళించేందుకు మతోన్మాదశక్తుల కుట్ర : సీఎల్పీనేత భట్టి
చరిత్రను వక్రీకరించి మత ఘర్షణలు సృష్టించి తెలంగాణను కబళించేందుకు మతోన్మాదశక్తులు కుట్ర చేస్తున్నాయని సీఎల్పీనేత, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. మధిరలో శుక్రవారం తెలంగాణ జాతీయ సమ్యైకతా వజ్రోత్సవాల ర్యాలీ, సభలో టీఆర్ఎస్ నాయకులతో కలిసి పాల్గొన్న ఆయన ప్రసంగించారు. సెప్టెంబరు 17 విమోచన కాదని, తెలంగాణకు స్వాతంత్య్రం వచ్చినరోజుగా పేర్కొన్నారు. మతోన్మాద శక్తులు విమోచన పేరిట సభలు నిర్వహించడం సబబు కాదని, ఉత్సవాలు గర్వంగా, గౌరవంగా ఉండాలేకాని గాయపర్చకూడదని అభిప్రాయపడ్డారు. మతోన్మాద శక్తులను మధిర దరిదాపుల్లోకి కూడా రానివ్వద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. నాటి పోరాటంలో ఏనాడూ భాగస్వామ్యంలేని రాజకీయపార్టీల నాయకులు రాజకీయాధికారంకోసం చరిత్రను వక్రీకరిస్తున్నారని ఆరోపించారు. అదే కుట్రతో హైదరాబాద్లో సభలు జరుపుతున్నారని మండిపడ్డారు. మతఘర్షణలు సృష్టించే విచ్చిన్నకర శక్తులను కాంగ్రె్సపార్టీ కచ్చితంగా అడ్డుకుంటుందని తెలిపారు.
సంక్షేమం, అభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా తెలంగాణ : ఎంపీలు నామ, వద్దిరాజు
టీఆర్ఎస్ లోభసభాపక్షనేత, ఎంపీ నామ నాగేశ్వరరావు, రాజ్యసభసభ్యుడు వద్దిరాజు మాట్లాడుతూ అహింస, శాంతియుత పద్ధతిలో పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఈ ఏనిమిదేళ్లలో సంక్షేమం, అభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. అలాంటి రాష్ట్రంలో మతవిద్వేషాలు రెచ్చగొట్టడం సరికాదన్నారు. ఈకార్యక్రమానికి జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు అధ్యక్షత వహించారు. అంతకు ముందు మధిర పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో భట్టి, ఎంపీలు నామ, వద్దిరాజు జాతీయ జెండాలు చేతబట్టి ఉత్సాహంగా పాల్గొన్నారు.
అట్టహాసంగా వేడుకలు
సత్తుపల్లిలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆధ్వర్యంలో భారీర్యాలీ నిర్వహించారు. మహిళలు బతుకమ్మలు, కోలాటాలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రభుత్వ అభివృద్ధి శకటాలను ప్రదర్శించారు. డీసీఎంఎస్ చైర్మన రాయల శేషగిరిరావు పాల్గొన్నారు. పాలేరులో ఎమ్మెల్యే కందాల ఉపేందర్రెడ్డి, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, వైరాలో ఎమ్మెల్యే రాములునాయక్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, కలెక్టర్ దురిశెట్టి అనుదీప్, ఎస్పీ జి.వినీత ప్రదర్శనలో పాల్గొన్నారు. పినపాక నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన వేడుకల్లో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు, భద్రాచలంలో ఎమ్మెల్యే పొదెం వీరయ్య, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి గౌతం, అశ్వారావుపేటలో ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, ఇల్లెందు నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాణోత హరిప్రియ, జడ్పీ చైర్మన కోరం కనకయ్య పాల్గొన్నారు.