రెవెన్యూ మేళాలో 52 దరఖాస్తులు
ABN , First Publish Date - 2022-03-17T04:48:12+05:30 IST
ఖమ్మం నగరపాలకసంస్థ కార్యాలయంలో బుధవారం ఆస్తి, పంపు పన్నులకు సంబంధించి రెవెన్యూ మేళా నిర్వహించారు.
ఖమ్మంకార్పొరేషన్,మార్చి15: ఖమ్మం నగరపాలకసంస్థ కార్యాలయంలో బుధవారం ఆస్తి, పంపు పన్నులకు సంబంధించి రెవెన్యూ మేళా నిర్వహించారు. ఆస్తిపన్నులకు సంబంధించి 29, పంపుపన్నులకు సంబంధించి 23 ఫిర్యాదులు వచ్చాయి. పంపు పన్నులు చెల్లించినా నమోదు కాలేదని కొందరు, ఆస్తిపన్నులు ఎక్కువగా వచ్చాయని మరి కొందరు తమ ఫిర్యాదుల్లో పేర్కొన్నారు.
నెలాఖరులోపు పరిష్కరించండి: నగరపాలక సంస్థ కమిషనర్ ఆదర్శ్సురభి
రెవెన్యూమేళాలో వచ్చిన ఫిర్యాదులను నెలాఖరులోగా పరిష్కరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఆదర్శ్ సురభి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించిన అనంతరం బుధవారం రెవెన్యూ అధికారులు, సిబ్బందితో తన ఛాంబర్లో సమావేశం నిర్వహించారు. ప్రజలు చెల్లించిన పన్నులను ఎప్పటికప్పుడు ఆన్లైన్ చేయాలన్నారు. రెవెన్యూమేళాలో వచ్చిన ప్రతీఫిర్యాదును పరిశీలించి, ఆయా ఫిర్యాదుదారుని ఇంటికి వెళ్లి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. అవసరమైతే మళ్లీ ఇంటి కొలతలు తీసుకోవాలని సూచించారు. కాగా కొందరికి రెండుసార్లు ఇంటిపన్నులు చెల్లించాలని నోటీసులు వెళుతున్నట్లు ఫిర్యాదులు వచ్చాయని, వాటిని పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమీక్షాసమావేశంలో ఆర్వో జీ.శ్రీనివాస్, ఆర్ఐలు కే.శ్రీనివాస్, లోకేష్ పాల్గొన్నారు.