త్రివర్ణ పతాకమా.. నీకు వందనం..
ABN , First Publish Date - 2022-08-17T05:40:27+05:30 IST
త్రివర్ణ పతాకమా.. నీకు వందనం.. అంటూ జిల్లా కేంద్రంలో ప్రజలు ముక్త కంఠంతో నినదించారు.
- జిల్లా కేంద్రంలోని పలు కూడళ్లలో సామూహిక జాతీయ గీతాలాపన
- పాల్గొన్న కలెక్టర్, అదనపు కలెక్టర్, ఎమ్మెల్యే
పెద్దపల్లి టౌన్, ఆగస్టు 16: త్రివర్ణ పతాకమా.. నీకు వందనం.. అంటూ జిల్లా కేంద్రంలో ప్రజలు ముక్త కంఠంతో నినదించారు. చిన్నాపెద్దా తేడా లేకుండా సామూహికంగా జాతీయ గీతాన్ని ఆలకించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు మంగళవారం ఉదయం పదకొండున్నర గంటలకు ఎక్కడి జనం అక్కడే నిలిచిపోయి జాతీయ జెండాకు సెల్యూట్ చేస్తూ గీతాలాపన చేశారు. పోలీస్, మున్సిపల్ శాఖలు స్థానిక జెండా చౌరస్తాలో సభ ప్రాంగణం ఏర్పాటు చేశారు. వ్యాపార సంస్థల యజమానులు, కార్మికులు, వినియోగదారులు, విద్యార్థులు పెద్దఎత్తున హాజరయ్యారు. కలెక్టర్ సంగీత సత్యనారాయణ, అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి, ఏసీపీ సాదుల సారంగపాణి, సీఐలు ప్రదీప్కుమార్, అనీల్కుమార్, ఎస్సై రాజేష్, సహదేవ్సింగ్, మున్సిపల్ చైర్మెన్ మమతారెడ్డి, కమిషనర్ చాడల తిరుపతిలు ఏర్పాట్లను పర్యవేక్షించారు. జాతీయ గీతాలాపనకు పదకొండున్నర సమయానికి కౌంట్ డౌన్ మొదలుపెట్టి సామూహికంగా జాతీయ గీతాన్ని పాడారు. అనంతరం ఆకాశంలోకి బెలూన్లు వదిలిపెట్టారు. అలాగే బస్టాండ్, అయ్యప్ప టెంపుల్, కమాన్ చౌరస్తాల్లోనూ ట్రాపిక్ను నిలిపివేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఆయా కార్యక్రమాల్లో జడ్పీటీసీ బండారి రాంమూర్తి, ఎంపీపీ బండారి స్రవంతి, పెంచాల శ్రీదర్, ఫహీం, జావీద్ తదితరులు పాల్గొన్నారు.