నగరం పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత
ABN , First Publish Date - 2022-01-18T05:17:31+05:30 IST
నగర పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని మేయర్ వై సునీల్రావు తెలిపారు.
మేయర్ వై సునీల్రావు
కరీంనగర్ టౌన్, జనవరి 17: నగర పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని మేయర్ వై సునీల్రావు తెలిపారు. అమృత్ మహోత్సవ్, స్వచ్ఛ సర్వేక్షణ్-2022లో భాగంగా సోమవారం కోర్టు చౌరస్తాలో పరిశుభ్రత, ప్లాస్టిక్ నివారణ, తడి పొడి చెత్త వేరు, తదితర అంశాలపై నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనను కమిషనర్ సేవా ఇస్లావత్తో కలిసి మేయర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు అయిన సందర్భంగా ప్రభుత్వం ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమం చేపట్టిందన్నారు. ఇందులో భాగంగా ప్రజలకు స్వచ్ఛత, ప్లాస్టిక్ నిర్మూలన, స్వచ్ఛ సర్వేక్షణ్, తడి చెత్త పొడి చెత్త వేరు లాంటి అంశాలపై అవగాహన కల్పిస్తోందన్నారు. మన నగరం.. మన పరిశుభ్రత.. మన బాధ్యత అనే నినాదంతో ప్రతి ఒక్కరు సాధ్యమైనంత వరకు నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంతో పాటు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలన్నారు. అందరం కలిసికట్టుగా చెత్తపై సమరం చేస్తేనే స్వచ్ఛ నగరం సాధ్యమవుతుందని అన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు ఏదుల్ల రాజశేఖర్, సరిల్ల ప్రసాద్, ఎడ్ల సరిత అశోక్, వంగల శ్రీదేవి పవన్, డిప్యూటీ కమిషన్ త్రయంభకేశ్వర్, ఈఈ రామన్, శానిటేషన్ సూపర్వైజర్, రాజమనోహర్, ఎన్విరాల్మెంట్ ఇంజనీర్ స్వామి పాల్గొన్నారు.