నూతన సంవత్సర వేడుకలపై నిఘా
ABN , First Publish Date - 2022-12-31T00:08:52+05:30 IST
నూతన సంవత్సరం వేడుకలపై ప్రత్యేక నిఘాకు ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ రాహుల్ హెగే తెలిపారు. శుక్రవారం ఆయన జిల్లా పోలీసు కార్యాలయంలో మాట్లాడారు. 2022కి వీడ్కోలు పలుకుతూ 2023కి ఆహ్వానం పలికే సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
- ఎస్పీ రాహుల్ హెగ్డే
సిరిసిల్ల క్రైం, డిసెంబరు 30: నూతన సంవత్సరం వేడుకలపై ప్రత్యేక నిఘాకు ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ రాహుల్ హెగే తెలిపారు. శుక్రవారం ఆయన జిల్లా పోలీసు కార్యాలయంలో మాట్లాడారు. 2022కి వీడ్కోలు పలుకుతూ 2023కి ఆహ్వానం పలికే సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలోని 13 పోలీస్స్టేషన్ల పరిధిలో ముందస్తు భద్రతా చర్యలు చేపట్టామన్నారు. జిల్లాలోని ప్రధాన కూడళ్ల వద్ద వాహనాల తనిఖీలను ముమ్మరం చేస్తున్నామన్నారు. ప్రధానంగా ర్యాష్డ్రైవింగ్, డ్రంకెన్డ్రైవ్పై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శనివారం సాయంత్రం నుంచి డ్రంకెన్డ్రైవ్ తనిఖీలు ఉంటాయన్నారు. మైనర్లకు ద్విచక్రవాహనాలను ఇవ్వవద్దన్నారు. మైనర్లు పట్టుబడితే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామన్నారు. అధిక వేగవం, త్రిబుల్ రైడింగ్తో ఇతరులను ఇబ్బంది పెడితే వాహనాలు సీజ్ చేస్తామన్నారు. గుంపులుగా రోడ్లపైకి వచ్చి కేకలు వేస్తూ తిరగవద్దని, వాహనాలతో ర్యాలీగా వెళ్లరాదని అన్నారు. రోడ్లపై టపాసులు, మైకులు, ఎక్కువ సౌండ్ పెట్టి ఇబ్బంది పెట్టకూడదన్నారు. డీజేలు సీజ్ చేస్తామని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇళ్లపైనా, ప్రైవేటు ఆస్తులపైనా, వీధి దీపాలపైనా రాళ్లు వేసి అద్దాలు పగుల గొట్టడం, మహిళలను ఇబ్బంది పెట్టడం, అసభ్యంగా ప్రవర్తించడం వంటివి చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగడం నిషధం అన్నారు. పోలీసు శాఖకు సంపూర్ణ సహకారం అందించాలని, నూతన సంవత్సర వేడుకలను కుటుంబ సభ్యులతో ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలని సూచించారు. అనంతరం జిల్లా ప్రజలకు ఎస్పీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
ఆంక్షలను ప్రతి ఒక్కరు పాటించాలి
గంభీరావుపేట: డిసెంబరు 31 సంధర్బంగా పోలీస్ల ఆంక్షలను అతిక్రమిస్తేచర్యలు తప్పవని, నిభంధనలను ప్రతి ఒక్కరు పాటించాలని స్థానిక ఎస్సై మహేష్ తెలిపారు. నిర్ణీత సమయంలోనే మద్యం షాపులు మూసి వేయాలన్నారు. నిభంధనలను అతిక్రమిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు.
ఇల్లంతకుంట: ఇతరులకు ఇబ్బందులు కలిగించేలా వ్యవహరిస్తే చర్యలు తప్పవని ఎస్సై మామిడి మహేందర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం వాహనాల సైలెన్సర్లు తీసి వాహనాలు నడపడం, మద్యం సేవించి రోడ్లపై తిరగడం చేస్తే కేసులు నమోదు చేస్తామన్నారు.