నేతన్న కుటుంబం ఆత్మహత్యలపై కొనసాగుతున్న విచారణ

ABN , First Publish Date - 2022-02-09T05:04:28+05:30 IST

చేనేత కార్మికుడి కుటుంబం ఆత్మహత్యలపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. అప్పుల బాధతోనే తల్లిదండ్రులు, కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని కూతురు ఫిర్యాదు చేయగా, పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు.

నేతన్న కుటుంబం ఆత్మహత్యలపై కొనసాగుతున్న విచారణ
పరామర్శిస్తున్న పద్మశాలి సంఘం నాయకులు

 చొప్పదండి, ఫిబ్రవరి 8: చేనేత కార్మికుడి కుటుంబం ఆత్మహత్యలపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. అప్పుల బాధతోనే తల్లిదండ్రులు, కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని కూతురు ఫిర్యాదు చేయగా, పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. సెల్‌ఫోన్లను, ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు వారం రోజులుగా ఎవరెవరితో ఎక్కువగా మాట్లాడారో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. చొప్పదండి మండలంలోని కాట్నపల్లికి చెందిన బైరి శంకయ్య, భార్య జమున, కుమారుడు శ్రీధర్‌లు సోమవారం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటనపై గ్రామస్థులు కూడా ఆరా తీస్తున్నప్పటికి ఎవరికి అంతు చిక్కడం లేదు. వారం రోజుల క్రితం న్యూజిలాండ్‌లో ఉన్న పెద్ద కూతురితో తల్లిదండ్రులు శంకరయ్య, జమున చాలాసార్లు మాట్లడినట్లు గ్రామస్థులు చెబుతున్నారు. రెండు, మూడు రోజులకు ఒకసారి శంకరయ్య నూలు దారాన్ని చొప్పదండికి వెళ్లి తెచ్చుకుంటుండగా ఎవరితో కూడా ఎలాంటి బాధలు పంచుకోలేదని చెబుతున్నారు. చిన్న కూతురు వివాహ సమయంలో చేసిన అప్పుల కోసం కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదని, మరేదో కారణం ఉండవచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. శకంరయ్య సాంచాలు నడిపిస్తుండగా భార్య జమున బీడీలు చుడుతుండేది. కుమారుడు శ్రీధర్‌ ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తూ నెలకు 25 వేల వరకు వేతనం పొందేవాడు. ఈ నేపథ్యంలో పెళ్లి కోసం చేసిన అప్పులు తీర్చడం పెద్ద కష్టమేమి కాదని గ్రామస్థులు అంటున్నారు. మరో రెండు, మూడు రోజుల పోలీసుల విచారణలో ఆత్మహత్యలకు కారణాలు తెలిసే అవకాశం ఉంది. 


 చేనేత శాఖ విచారణ...


నేత కార్మికుడి కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకున్న సంఘటనపై  చేనేత జౌళిశాఖ ఏడీ సంపత్‌ ఆధ్వర్యంలో విచారణ జరిపారు. మంగళవారం మండలంలోని కాట్నపల్లిలో ఆత్మహత్య చేసుకున్న శంకరయ్య కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. ఆత్మహత్యకు గల కారణాలను శంకరయ్య కూతురు అఖిలను అడిగి తెలుసుకున్నారు. బ్యాంకుతోపాటు ప్రైవేట్‌గా ఉన్న అప్పులపై ఆరా తీశారు. అనంతరం ఏడీ చొప్పదండి ఎస్‌ఐ వంశీకృష్ణను కలిసి మాట్లాడారు. పద్మశాలి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వొల్లాల కృష్ణహరి ఆధ్వర్యంలో పలువురు నాయకులు శంకరయ్య కుటుంబాన్ని పరామర్శించారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బండారి శేఖర్‌తోపాటు పలువురు నాయకులు కుటుంబాన్ని పరామర్శించారు.  

Updated Date - 2022-02-09T05:04:28+05:30 IST