తెలంగాణ హక్కుల సాధనకోసం కేసీఆర్ పోరాడాలి
ABN , First Publish Date - 2022-12-15T00:05:11+05:30 IST
పార్లమెంట్ సమావేశాలు నడుస్తున్న తరుణంలో తెలంగాణ హక్కుల సాధన కోసం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద 112 మంది ఎమ్మెల్యేలతో కలిసి సీఎం కేసీఆర్ రిలే నిరాహార దీక్ష చేసి పోరాడాలని ఎమ్మెల్సీ జీవన్రెడ్డి పేర్కొన్నారు. జగిత్యాలలోని ఇంధిరాభవన్లో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
జగిత్యాల టౌన్, డిసెంబరు 14: పార్లమెంట్ సమావేశాలు నడుస్తున్న తరుణంలో తెలంగాణ హక్కుల సాధన కోసం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద 112 మంది ఎమ్మెల్యేలతో కలిసి సీఎం కేసీఆర్ రిలే నిరాహార దీక్ష చేసి పోరాడాలని ఎమ్మెల్సీ జీవన్రెడ్డి పేర్కొన్నారు. జగిత్యాలలోని ఇంధిరాభవన్లో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మోదీ వస్తే ఈడీ వస్తారని ఆరోపిస్తున్న బీఆర్ఎస్ నాయకుల మాటలు వాస్తవేమనని, అదే తరహాలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా తీసిపోని విధంగా ఎలాంటి ఆధారాలు లేకుండా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కార్యాలయంలో సోదాలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. ప్రత్యర్థులను అణిచివేసే విధంగా బీఆర్ఎస్ నాయకులు పోలీసులను వాడుకుంటున్నారని ఆరోపించారు. ఉద్యమ ఆకాంక్షల ను ఏమేరకు నెరవేర్చారో సీఎం కేసీఆర్ ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. తెలం గాణ ప్రభుత్వం మొన్నటి వరకు బీజేపీకి విత్రపక్షంగా ఆరేళ్లు అంటకాగి ఊరేగి హక్కులను సాధించుకోలేక బీఆర్ఎస్ను తెరమీదికి తెచ్చారన్నారు. నిజమైన రైతు ప్రభుత్వం యూపీఏ ప్రభుత్వమని ఆనాడు ఒక్క కలం పోటుతో రూ. 70 వేల కోట్ల రుణాలను మాఫీ చేసి రైతులకు అండగా నిలిచామన్నారు. అదే బీజేపీ ప్రభుత్వంలో పెట్టుబడి దారులు బ్యాంకుల ద్వారా పొందిన రూ. 10 లక్షల కోట్ల రుణాలను ఎన్పీఏ కింద రద్దు చేసిందన్నారు. రైతుబంధు పేరుతో వ్యవసాయ రంగంలో ఉన్న అన్ని రాయితీలను కేసీఆర్ ప్రభుత్వం రద్దుచేసిందని ఆరోపిం చారు. కిసాన్ సర్కార్ అంటే ఇదేనా అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన ఘనుడు కేసీఆర్ అని అన్నారు. అవినీతి ఆరోపణలు వస్తే ఎవరైనా సరే జైలుకు వెళ్లాల్సిందే అని అనాడు కేసీఆర్ మాట్లాడారని ఇది కవిత విషయంలో వర్తించదా అని ప్రశ్నించారు. కేసీఆర్కు బీఆర్ఎస్ ఇక వీఆర్ఎస్గా మారనుందన్నారు. కాంగ్రెస్ సోషల్ మీడియా కార్యాలయంపై పోలీసులు సోదాలను తీవ్రంగా ఖండించారు. ఈ సమావేశంలో పీసీసీ సభ్యుడు గిరి నాగభూషణం, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు విజ యలక్ష్మి, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు మన్సూర్, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు మధు, ప్లోర్ లీడర్ దురయ్య, నాయకులు గాజుల రాజేందర్, రమేష్ బాబు, చాంద్ పాష, మున్నా, నేహాల్, మహిపాల్, రజనీకాంత్, రాజేష్, విజయ్ తదితరులు ఉన్నారు.