కాంతుల కేళి.. దీపావళి
ABN , First Publish Date - 2022-10-23T23:42:28+05:30 IST
వెలుగులు తెచ్చే పండుగగా విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారు. దీపావళి దివ్య దీపాల వరస అజ్ఞానపు పొరలను తొలగించి విజ్ఞానపు వెలుగులను నింపుతుంది.
- మహాలక్ష్మి కొలువయ్యే వేళ
- ముస్తాబైన దుకాణాలు
- తారాజువ్వల సంబరం
- ముస్తాబైన వేములవాడ రాజన్న ఆలయం
- నేడు దీపావళి పండుగ
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)
వెలుగులు తెచ్చే పండుగగా విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారు. దీపావళి దివ్య దీపాల వరస అజ్ఞానపు పొరలను తొలగించి విజ్ఞానపు వెలుగులను నింపుతుంది. ప్రతి ఇంటా వెలుగులు నింపే దీపావళి పండుగను సోమవారం సంతోషంగా జరుపుకోవడానికి జిల్లా ప్రజలు సిద్ధమయ్యారు. మంగళవారం అమవాస్య రోజున దీపావళి జరుపుకోవాల్సి ఉన్నప్పటికీ సూర్యగ్రహణం కారణంగా సోమవారం లక్ష్మీ పూజలతోపాటు దీపావళి పండుగను నిర్వహించుకోనున్నారు. సోమవారం రోజున ఉదయం భోగి హారతులు, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 11 వరకు ధనలక్ష్మీ పూజలు, కేదారేశ్వర నోములు జరుపుకోవచ్చని బ్రాహ్మణులు తెలిపారు. బుధవారం 26న పౌడ్యమి నిర్వహించుకోనున్నారు.
దీపం జ్ఞానానికి ప్రతీక...
దీపం జ్ఞానానికి ప్రతీక. ఏ శుభకార్యమైనా జ్యోతి ప్రజ్వలనతోనే మొదలవుతుంది. దీప కాంతిని త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు ప్రతీకలుగా కొలుస్తారు. దీపం సాక్షాత్తు లక్ష్మీదేవి. దీపావళి జగత్నంతటినీ కాంతిమయం చేస్తుంది. ప్రతీ వ్యక్తి జీవితంలో దైవం ప్రాముఖ్యతను దీపావళి చాటుతుంది. ఇంటి ముంగిట, దేవాలయాల్లో, మఠాల్లో, ప్రకారాల్లో, గోశాల, వీధుల వెంబడి దీపాలు వెలిగించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. లక్ష్మీదేవి పూజలను నిర్వహించడానికి వాణిజ్య సంస్థలు, దుకాణదారులు, ప్రజలు ఏర్పాట్లు చేసుకున్నారు. దీపావళికి శోభనిచ్చే విధంగా టపాసుల అమ్మకాలు, నోరూరించే మిఠాయిలు, దుకాణాలను విద్యుత్ దీపాలకాంతులతో వెలిగిపోయే విధంగా ముస్తాబు చేశారు.
వివిధ రాష్ట్రాల్లో....
దీపావళి పండుగ మన రాష్ట్రంతోపాటు వివిధ రాష్ట్రాల్లోనూ ఆనందంగా జరుపుకుంటారు. అస్సాం, బెంగాల్లో జగదాత్రి పూజగా చేసుకుంటారు. ఒరిస్సాలో కూమార పూర్ణిమగా జరిపి దీపావళి వరకు కన్యలు ఆనంద దీపోత్సవాలతో ఆటాపాటలతో కాలక్షేపం చేస్తారు. దక్షిణ భారతంలో బలి చక్రవర్తిని అణచిన మహావిష్ణువు విజయంగా కొందరు, నరకాసుర వధ చేసిన శ్రీకృష్ణ విజయంగా మరికొందరు పండుగను జరుపుకుంటారు. కేరళలో బలిచక్రవర్తిని జయించిన విజయోత్సవంగా, తమిళనాడులో తెల్లవారుజామున లేచి నరక చతుర్దశి జరుపుకుంటారు. కర్ణాటకలో మూడు రోజులపాటు పండుగ జరుపుకుంటే రాజ స్థాన్లో దన్ తెరాస్గా నిర్వహిస్తారు. మహిళలు ఆ రోజు నగలను నదిలో శుభ్రం చేసి పిల్లిని లక్ష్మీదేవిగా పూజిస్తారు. అన్ని రకాల వంటలు పిల్లికి నైవేద్యంగా సమర్పిస్తారు. గుజరాత్లో పిండివంటలతో లక్ష్మీదేవికి పూజలు చేస్తారు. మహారాష్ట్రలో లక్ష్మీపూజ, గణేష్ పూజ జరుపుతారు. మార్వాడిలు దీపావళి రోజునుంచే కొత్త ఖాతాలు ప్రారంభిస్తారు. ఉత్తర భారతంలో మహాలక్ష్మికి, దక్షిణాదిలోని కేరళలో పాతాళం నుంచి బలిమహారాజు భూమిపైకి వచ్చి దర్శనమిస్తాడని భావిస్తారు.
దీపావళి కథలెన్నో...
పండుగల్లో దీపావళి ఉత్సాహాన్ని నింపుతుంది. ఆ దీపావళి వెనక ఎన్నెన్నో కథలు ఉన్నాయి. తండ్రి ఆజ్ఞా ప్రకారం శ్రీరాముడు 14సంవత్సరాలు అరణ్య వాసానికి వెళ్తాడు. అక్కడ లంకాదిపతి రావణుడు రాముడు లేని సమయం చూసి సీతమ్మవారిని ఎత్తుకుపోయి లంకలో బంధిస్తాడు. ఇది తెలుసుకున్న రాముడు వానర సైన్యంతో వెళ్లి రావణాసురుడిని ఓడించి సీతమ్మను తీసుకొస్తాడు. అరణ్య వాసం పూర్తి కావడంతో ఆయోధ్య నగరానికి తిరిగి వచ్చిన సందర్భంలో నగర ప్రజలు సంతోషంగా ఇళ్లలో దీపాలు వెలిగించి టపాసులు కాల్చి ఆనందం వ్యక్తం చేస్తారు. ఇదిలా ఉంటే చిరకాలం జీవించాలనే ఆశతో అమృతం కోసం దేవతలు, రాక్షసులు కలిసి పాల సముద్రాన్ని చిలుకుతుంటారు. అమృతంకంటే ముందుగా సముద్రం నుంచి లక్షీదేవి ఉద్బవిస్తుంది. అమ్మవారు జన్మించిన ఈ రోజు ఇంటి నిండా దీపాలు వెలిగించి లక్ష్మీదేవి అనుగ్రహంతో సిరి సంపదలు లభిస్తాయని దీపావళి ప్రారంభించుకుంటారు. దాపరయుగంలో రాక్షస రాజు నరకాసురుడు వర గర్వంతో ముల్లోకాలను దేవతలను, ప్రజలను ముప్పు తిప్పలు పెడుతాడు. శ్రీకృష్ణుడు రంగంలోకి దిగి నరకాసురుడిని వధిస్తాడు. దీంతో ప్రజలు సంతోషంగా దీపాలు వెలిగిస్తారు. ఇది దీపావళిగా మారిందని మరోకథనం. పాండవులు కౌరవులతో జూదం ఆడి ఓడిపోవడంతో 12 సంవత్సరాల అరణ్య వాసం, ఏడాది అజ్ఞాత వాసానికి వెళ్లాల్సి వస్తుంది. సుదీర్ఘ కాలం తారువాత పాండవులు తిరిగి రాజ్యానికి చేరుకోవడంతో ప్రజలు సంతోషంగా దీపాలు వెలిగించి స్వాగతం పలుకుతారు. ఇదే దీపావళి అయ్యిందని మరి కొందరి నమ్మకం.