ముంపు గ్రామంగా ప్రకటించండి
ABN , First Publish Date - 2022-07-18T06:20:07+05:30 IST
వానలు, వరదలు వచ్చినప్పుడల్లా ఇబ్బంది పడుతున్నామని, తమ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ నారాయణపూర్ నుంచి గంగాధర మండల కేంద్రం వరకు ఆదివారం కాలినడకన వచ్చారు.
- గంగాధరకు కాలినడకన వచ్చిన నారాయణపూర్ గ్రామస్థులు
గంగాధర, జూలై 17: వానలు, వరదలు వచ్చినప్పుడల్లా ఇబ్బంది పడుతున్నామని, తమ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ నారాయణపూర్ నుంచి గంగాధర మండల కేంద్రం వరకు ఆదివారం కాలినడకన వచ్చారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. ఎమ్మెల్యే రవిశంకర్కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమకు శాశ్వత ప్రాతిపదికన పునరావాసం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. నారాయణపూర్ రిజర్వాయర్ ఏర్పడినప్పటి నుంచి భారీ వర్షం కురిస్తే ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నామన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పెద్ద ఎత్తున వరద వచ్చి రిజర్వాయర్ నిండుకుండలా మారిందన్నారు. గ్రామంలోని ఇళ్లలోకి నీరు జాలువారుతోందని, ఇళ్లు కూలిపోయే పరిస్థితిలో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమ గ్రామాన్ని వెంటనే ముంపు గ్రామంగా ప్రకటించి శాశ్వత ప్రాతిపదికన పునరావాసం కల్పించాలని ఎమ్మెల్యేను కోరారు.