దేశం గర్వించేలా వజ్రోత్సవాలు
ABN , First Publish Date - 2022-08-20T05:13:05+05:30 IST
స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం దేశం గర్వించేలా పదిహేను రోజులపాటు నిర్వహిస్తోందని జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ అన్నారు.
- జడ్పీ చైర్పర్సన్న్యాలకొండ అరుణ
సిరిసిల్ల, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం దేశం గర్వించేలా పదిహేను రోజులపాటు నిర్వహిస్తోందని జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ అన్నారు. వజ్రోత్సవాల్లో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని రంగినేని ట్రస్ట్లో అనాఽథ పిల్లలు, వృద్ధులకు కలెక్టర్ అనురాగ్ జయంతితోకలిసి పండ్లు, స్వీట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ వజ్రోత్సవాల్లో భాగంగా వృద్ధులు, అనాథ పిల్లలకు పండ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ లక్ష్యం, పట్టుదల, ధృడ సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యమని, ప్రతీ విద్యార్థి లక్ష్యంతో ముందుకు వెళ్లాలని అన్నారు. ఇందుకు ఉదాహరణ నిజామాబాద్కు చెందిన మహిళా బాక్సర్ నిఖిత్ జరీన్ అన్నారు. సంకల్పంతోనే ఒలింపిక్స్తోపాటు కామన్వెల్త్ క్రీడల్లోనూ మెడల్ సాధించినట్లు చెప్పారు. వృద్ధులు, అనాఽథ పిల్లలను చేరదీయడంతోపాటు సాహిత్యపరమైన కార్యక్రమాలు నిర్వహించడంపై రంగినేని ట్రస్ట్ నిర్వాహకులను అభినందించారు. బుక్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా సమకారంతో జిల్లా స్థాయి బుక్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తే జిల్లా యంత్రాంగం అన్ని విధాలుగా సహకరిస్తుందన్నారు. కార్యక్రమంలో రంగినేని ట్రస్ట్ ఫౌండర్ రంగినేని మోహన్రావు, జిల్లా సంక్షేమ అధికారి పి.లక్ష్మీరాజం, బాల రక్ష భవన్ కో ఆర్డినేటర్ సుచరిత, సఖి కేంద్రం నిర్వాహకురాలు రోజా, చైల్డ్ కమిటీ సభ్యుడు పూర్ణచందర్, చైల్డ్ ప్రొటక్షన్ అఽధికారి స్వర్ణలత పాల్గొన్నారు.