ఎసెస్సీ విద్యార్థులకు అల్పాహారం

ABN , First Publish Date - 2022-12-30T23:27:06+05:30 IST

పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతుల సమయంలో అల్వాహారం అందజేయాలని కరీంనగర్‌ నగర పాలక సంస్థ నిర్ణయించింది.

ఎసెస్సీ విద్యార్థులకు అల్పాహారం
సమావేశంలో మాట్లాడుతున్న మేయర్‌ సునీల్‌రావు, హాజరైన కార్పొరేటర్లు

కరీంనగర్‌ టౌన్‌, డిసెంబరు 30: పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతుల సమయంలో అల్వాహారం అందజేయాలని కరీంనగర్‌ నగర పాలక సంస్థ నిర్ణయించింది. కలెక్టరేట్‌ ఆడిటోరియంలో మేయర్‌ యాదగిరి సునీల్‌రావు అధ్యక్షతన కరీంనగర్‌ నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏజెండాలోని 95 అంశాలకు పాలకవర్గం ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగిన ఈ సమావేశంలో అధికార బీఆర్‌ఎస్‌, బీజేపీ, ఎంఐఎం పార్టీలకు చెందిన కార్పొరేటర్లు, కో ఆప్షన్‌ సభ్యులు పాల్గొన్నారు. కార్పొరేటర్లు ప్రాతినిధ్యం వహిస్తున్న డివిజన్లలోని ప్రజా సమస్యలు, అభివృద్ధి పనులపై ప్రస్తావించగా మేయర్‌ వాటిని పరిశీలించి పరిష్కరిస్తామంటూ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మేయర్‌ సునీల్‌రావు మాట్లాడుతూ నగరపాలక సంస్థ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఈ సంవత్సరం నుంచే విద్యార్థి చేయూత పథకాన్ని అమలు చేస్తామని చెప్పారు. దాదాపు 700 మంది విద్యార్థులు పదో తరగతి చదువుతున్నారని, వారికి ఒక్కొక్కరికి అల్పాహారానికి 20 నుంచి 40 రూపాయలు కేటాయిస్తున్నారని, వాటిని నగరపాలక సంస్థ అందిస్తుందన్నారు. వేసవిలో మంచినీటి సమస్య తలెత్తకుండా అన్ని ముందస్తు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. రోడ్లు, డ్రైనేజీలు, పార్కులు, స్మశానవాటిక అభివృద్ధితోపాటు మెరుగైన పారిశుధ్య నిర్వహణ, ప్రతి రోజు సమయపాలనతో మంచినీటి సరఫరా జరిగేలా చూస్తామని చెప్పారు. పందులు, కోతులు, కుక్కల సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని అన్నారు. నగరంలో ఎక్కడ కూడా తాగునీటి సరఫరాకు అంతరాయం కలుగకుండా పైపులైన్ల లీకేజీలను గుర్తించి వెంటవెంటనే వాటికి మరమ్మతులు చేయాలని సూచించారు. నీటిశుద్ధికరణ కేంద్రంతోపాటు కోర్టు, మార్కెట్‌ రిజర్వాయర్‌లలో స్టాండ్‌ బై మోటార్లు ఏర్పాటు చేయాలని, జనరేటర్లను కూడా అందుబాటులో ఉంచుకోవాలని, పారిశుధ్య పనులను మరింత మెరుగు పరిచేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అభివృద్ధి పనులు ప్రారంభించని కాంట్రాక్టర్లకు నోటీసులు ఇవ్వాలని, పనులు వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు. పార్కులు సక్రమంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. త్వరలో మరో 30 ఓపెన్‌ జిమ్‌లను ఏర్పాటు చేస్తామని, ఇందుకు సంబంధించిన టెండర్‌ ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. వచ్చే సర్వసభ్య సమావేశం మున్సిపల్‌ కార్యాలయంలోని నూతన సమావేశమందిరంలోనే ఏర్పాటు చేస్తామని మేయర్‌ ప్రకటించారు.

పోడియం ఎదుట బీజేపీ కార్పొరేటర్‌ బైఠాయింపు

55వ డివిజన్‌ బీజేపీ కార్పొరేటర్‌ పెద్దపల్లి జితేందర్‌ తన డివిజన్‌ పరిధిలోని మంకమ్మతో శ్రీరామ బుక్‌స్టాల్‌ ఎదుట రోడ్డుతోపాటు ఆ పక్కనే ఉన్న మరో రోడ్డు ఆకుల శైలజ హాస్పిటల్‌ దారి పూర్తిగా దెబ్బతిని ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ఈ విషయంపై పలుమార్లు తాను సభ దృష్టికే కాకుండా కమిషనర్‌, కలెక్టర్‌, మంత్రితోపాటు మేయర్‌ దృష్టికి తీసుకువచ్చినా ఎందుకు రోడ్లు వేయడం లేదని మేయర్‌ను ప్రశ్నించారు. దీనిపై స్పష్టమైన హామీ ఇచ్చే వరకు తాను ఆందోళన చేస్తానంటూ ‘బాంచన్‌ దొరా... మా రోడ్డు బాగు చేయండి’ అంటూ ప్లకార్డు పట్టుకొని పోడియం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. సమావేశం ముగిసిన తర్వాత కూడా జితేందర్‌ నిరసన కొనసాగించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 57వ డివిజన్‌లోని ప్రధాన రెండు రహదారులు శ్రీరామ బుక్‌స్టాల్‌ ముందు గల్లీ, ఆకుల శైలజ ఆసుపత్రి రోడ్లను అభివృద్ధి చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని, దీనిపై తాను ఆందోళనలు చేసినా స్పందించడం లేదన్నారు. బల్దియా సమావేశంలోనైనా తనకు స్పష్టమైన హామీ వస్తుందని భావించి పోడియం ఎదుట నిరసన తెలిపితే రెండేళ్ళ వరకు నిధులు కేటాయించమని చెప్పి మేయర్‌ వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఓటు వేసి గెలిపించిన ప్రజల కోసం తన పోరాటాన్ని కొనసాగిస్తానని జితేందర్‌ తెలిపారు. సమావేశంలో కమిషనర్‌ సేవా ఇస్లావత్‌, కార్పొరేటర్లు, కో అప్షన్‌ సభ్యులు, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-30T23:27:08+05:30 IST