బోనాలు అందుకో..మల్లన్న సామి

ABN , First Publish Date - 2022-03-21T06:56:16+05:30 IST

పెద్దాపూర్‌లో మల్లన్న జాతర ఉత్సవాలు ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు.

బోనాలు అందుకో..మల్లన్న సామి
పెద్దాపూర్‌లో మల్లన్న ఆలయం చుట్టు బోనాలతో ప్రదక్షణలు చేస్తున్న భక్తులు

కన్నుల పండుగా పెద్దాపూర్‌ మల్లన్న జాతర

సుమారు 60 వేల బోనాలతో మక్కుల చెల్లింపులు

వివిధ రాష్ట్రల నుంచి భక్తుల రాక

మెట్‌పల్లి రూరల్‌, వూర్చి, 20 : పెద్దాపూర్‌లో మల్లన్న జాతర ఉత్సవాలు ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. యాదవుల ఆరాధ్య దైవమైన మల్లన్న స్వామి బోనాల జాతర ప్రతి సంవత్సరం కాముడి పౌర్ణమి మొదటి ఆదివారం నిర్వహిస్తారు. ఉత్తర తెలంగాణలో పేరొందిన అతి పెద్ద మల్లన్న స్వామి బోనాల జాతర ప్రసిద్ధిగాంచింది. ఇక్కడికి యోటా ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌ రాష్ర్టాల నుంచి అధిక సంఖ్యల్లో భక్తులు తరలి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. పెళ్లి కానీ వారు, ఆనారోగ్యం బారిన పడిన వారు మల్లన్న స్వామిని దర్శించుకొని బోనాలు సమర్పించుకుంటే సమస్యలు తీరుతాయని భక్తుల నమ్మకం. ఈ సందర్భంగా ఉదయం నుంచి వివిధ రాష్ట్రలు, జిల్లాల నుంచి వచ్చిన సుమారు 80 వేల పైచిలుకు భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. భక్తులు భక్తి శ్రద్దలతో నైవేద్యంను తయారు చేసుకొని నెత్తిన ఎత్తుకొని డప్పు, మేళతాళాల నడుమ శివశత్తుల నృత్యాలతో ఆలయానికి శోభాయాత్రగా తరిలి వచ్చి సుమారు 60 వేల మంది భక్తులు ఆలయం చుట్టూ ప్రదక్షణలు చేసి బోనాలను సమర్పించారు. అనంతరం స్వామి వారికి బెల్లం, గొర్రె పిల్లలను కానుకలుగా సమర్పించుకొని మొక్కులు చెల్లించుకుంటారు. అనంతరం ఆలయాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో స్వామి వారి ఉత్సవమూర్తులను రథంలో ఏర్పాటు చేసి ఆలయం చుట్టు ప్రదక్షణ నిర్వహించారు. ఉత్సవాల్లో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, జడ్పీటీసీ సభ్యురాలు కాటిపెల్లి రాధ-శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచ్‌ కోరెపు రవి పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు జరిపి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో  ఎంపీటీసీ శంకరయ్య, ఉపసర్పంచ్‌ గంగాధర్‌, ఆలయాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు రమేశ్‌, పీఎస్‌సీఎస్‌ వైస్‌ చైర్మన్‌ జీవన్‌రెడ్డి, ప్రజాప్రతినిధులు, నాయకులు, భక్తులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-03-21T06:56:16+05:30 IST