IT Raids On Malla Reddy: భారీగా నగదు స్వాధీనం

ABN , First Publish Date - 2022-11-22T18:26:32+05:30 IST

తెలంగాణ మంత్రి మల్లారెడ్డి నివాసంతో పాటు ఆయన బంధువులు, సన్నిహితుల ఇళ్లలో ఇన్‌కమ్ టాక్స్ అధికారుల దాడులు

IT Raids On Malla Reddy: భారీగా నగదు స్వాధీనం
IT Raids On Malla Reddy

హైదరాబాద్: తెలంగాణ మంత్రి మల్లారెడ్డి నివాసంతో పాటు ఆయన బంధువులు, సన్నిహితుల ఇళ్లలో ఇన్‌కమ్ టాక్స్ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. ఉదయం 5 గంటలకు మొదలైన సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. మొత్తం 50 బృందాలు తనిఖీల్లో పాల్గొంటున్నాయి. మల్లారెడ్డికి చెందిన 14 విద్యాసంస్థల ప్రధాన కార్యాలయాల్లోనూ ఐటీ తనిఖీలు కొనసాగుతున్నాయి.

మల్లారెడ్డి సన్నిహితుల నివాసాల నుంచి ఐటీ అధికారులు భారీగా డబ్బు సీజ్ చేశారు. ఇప్పటికే సుచిత్రాలో ఉంటోన్న త్రిశూల్ రెడ్డి ఇంట్లో రెండు కోట్ల రూపాయలు సీజ్ చేశారు. జీడిమెట్ల పైప్ లైన్ రోడ్ లో నివాసం ఉంటున్న మరో సన్నిహితుడు రఘునాథ్ రెడ్డి వద్ద రెండు కోట్లా 80 లక్షలకు పైగా నగదు స్వాధీనం చేసుకున్నారు. కొంపల్లిలోని బొబ్బిలి ఎవెన్యూ లోని ఫ్లాట్ నెంబర్ 302లో ఉంటోన్న సంతోష్ రెడ్డి నివాసంపై ఐటీ అధికారులు దాడులు చేశారు. అయితే డోర్ ఓపెన్ చేయకపోవడంతో 3 గంటల పాటు వేచి చూసిన అధికారులు ఆ తర్వాత తాళాలు పగులకొట్టారు. ఆ సమయంలో సీఆర్‌పీఎఫ్ బలగాలు ఐటీ అధికారుల వెంట ఉన్నాయి. సంతోష్ రెడ్డి మల్లారెడ్డికి సంబంధించిన ఆర్థిక వ్యవహారాలు చూస్తున్నారు. సంతోష్ రెడ్డి నివాసంలో రెండు ఎలక్ట్రానిక్ లాకర్లను ఐటీ అధికారులు గుర్తించారు.

దూలపల్లి పల్లి రోడ్డులోని అశోక విల్లాలో నివాసం ఉంటోన్న్ మల్లారెడ్డి మరదలి కుమారుడు ప్రవీణ్ రెడ్డి ఇంట్లో కూడా ఐటి అధికారులు సోదాలు కొనసాగాయి. మల్లారెడ్డి యూనివర్సిటీకి సంబందించిన అన్ని వ్యవహారాలు ప్రవీణ్ రెడ్డి చూసుకుంటున్నారు.

మరోవైపు ఐటీ అధికారుల తనిఖీలు జరుగుతుండగా ఇంట్లో నుంచి బయటకు వచ్చిన మంత్రి మల్లారెడ్డి అభిమానులకు, మీడియాకు అభివాదం చేసి వెళ్లిపోయారు. అయితే మల్లారెడ్డి నివాసానికి టిఆర్ఎస్ కార్యకర్తలు భారీగా తరలివస్తున్నారు. మల్లారెడ్డికి మద్దతుగా, మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. సాయంత్రం 6 గంటలకు మల్లారెడ్డి నివాసానికి చేరుకోవాలని ముందుగానే సమాచారమిచ్చుకున్న కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

Updated Date - 2022-11-22T19:32:21+05:30 IST