మనకు ప్రజలు ఎందుకు ఓట్లేస్తలేరు : మధుయాష్కీ
ABN , First Publish Date - 2022-11-12T03:50:24+05:30 IST
కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఎందుకు ఓట్లు వేయడం లేదన్న అంశంపై సమీక్ష జరగాల్సిన అవసరం ఉందని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్ అన్నారు.
హైదరాబాద్, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఎందుకు ఓట్లు వేయడం లేదన్న అంశంపై సమీక్ష జరగాల్సిన అవసరం ఉందని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్ అన్నారు. పార్టీకి పట్టు ఉన్న మునుగోడులోనూ కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోవడం బాధాకరమన్నారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ ఆధ్వర్యంలో దీనిపై సమీక్ష జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఓటమిపై సమీక్షలే కాకుండా దిద్దుబాటు చర్య లు కూడా ఉంటాయని, పార్టీ నియమావళిని అతిక్రమించిన వారు ఎంతటివారైనా వారిపై క్రమశిక్షణ చర్యలు తప్పవని స్పష్టం చేశారు. శుక్రవారం గాంధీ భవన్లో మాట్లాడుతూ భారత్ జోడో యాత్రలో నాయకుల మధ్య ఐక్యత కనిపించడం మంచి పరిణామమన్నారు.
పార్టీకి దూరమైన వర్గాలను చేరదీయాల్సిన అవసరం ఉందని, టీడీపీ కూడా బీసీ వర్గాలను దగ్గర చేసుకునేందుకు వారికే నాయకత్వ బాధ్యతలను అప్పగిస్తోందని తెలిపారు. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నది నిజమేనని, గవర్నర్ ఫోన్ కూడా ట్యాప్ అయితే ఇక రక్షణ ఎవరికుంటుందని ప్రశ్నించారు. కాగా, మునుగోడులో ఎన్నికల సంఘం విఫలమైందని, దీనిపైన విచారణ జరగాలని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్ డిమాండ్ చేశారు.