వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలి: టీపీసీసీ
ABN , First Publish Date - 2022-11-06T03:47:10+05:30 IST
మునుగోడు ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపులో వీవీ ప్యాట్ స్లిప్పులు లెక్కించాలని ప్రధాన ఎన్నికల అధికారి...
హైదరాబాద్, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): మునుగోడు ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపులో వీవీ ప్యాట్ స్లిప్పులు లెక్కించాలని ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) వికా్సరాజ్ను టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్ కోరారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ఈ నెల 3న సీఎం కేసీఆర్ విడుదల చేసిన వీడియోలో ఈవీఎంలు ఉన్నంతవరకు తాము (బీజేపీ) అధికారంలో ఉంటామంటూ నిందితుడు రామచంద్ర భారతి వ్యాఖ్యానించారని ఆయన సీఈఓ దృష్టికి తెచ్చారు.
టీఆర్ఎస్, బీజేపీ విధానాలు ఒక్కటే : కోదండరెడ్డి
టీఆర్ఎస్, బీజేపీల ఆలోచనా విధానాలు ఒక్కటేనని కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి అన్నారు. ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారానికి సంబంధించి స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత ఆ రెండు పార్టీల పైనా ఉందన్నారు. శనివారం గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కోదండరెడ్డి మాట్లాడుతూ మొయినాబాద్ ఫార్మ్ హౌస్ ఘటనలో ఇరు పార్టీల నాయకులూ నేరస్తులేనన్నారు.