ఇలాంటి స్కూళ్లలో సీఎం మనుమడు చదవగలడా?: విజయశాంతి
ABN , First Publish Date - 2022-04-05T02:09:03+05:30 IST
హైదరాబాద్: విద్యార్థులు లేరనే కుంటిసాకులతో పేద విద్యార్థులు చదువుకునే స్కూళ్లను ఎవరి అభిప్రాయాలతోనూ సంబంధం లేకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి ఏటా మూసేస్తోందని...

హైదరాబాద్: విద్యార్థులు లేరనే కుంటిసాకులతో పేద విద్యార్థులు చదువుకునే స్కూళ్లను ఎవరి అభిప్రాయాలతోనూ సంబంధం లేకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి ఏటా మూసేస్తోందని బీజేపీ నాయకురాలు విజయశాంతి ఆరోపించారు. క్లాసు రూమ్స్, తాగునీటి సౌకర్యం, టాయిలెట్స్ ఏర్పాటులో అధికార యంత్రాంగం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని సిద్ధాంతి బస్తీలో ఉన్న ప్రైమరీ స్కూల్లో ఐదో తరగతి వరకున్న 120 మంది పిల్లలకు ఒకే క్లాస్ రూమ్ ఉందని చెప్పారు. స్కూల్ ఆవరణలో ఉన్న టాయిలెట్లు శిథిలావస్థకు చేరుకున్నాయని, తాగునీటి సౌకర్యం లేదని చెప్పారు. తాగునీటి కోసం విద్యార్థులు పడరాని పాట్లు పడుతున్నారని విజయశాంతి చెప్పారు.
ప్రభుత్వం ఇటీవల చేపట్టిన ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమానికి సిద్ధాంతి బస్తీ స్కూల్ను ఎంపిక చేయకపోవడం దారుణమన్నారు. స్కూల్ సమస్యల గురించి స్థానిక కౌన్సిలర్, ఆఫీసర్లకు ఎన్నిసార్లు చెప్పినా స్పందన కరువైందని టీచర్లు చెబుతున్నారు. ప్రహరీకి గేటు లేకపోవడంతో రాత్రి వేళ ఈ పాఠశాల అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిందని విజయశాంతి చెప్పారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇలాకాలోనే ఈ దుస్థితి ఏర్పడిందన్నారు. మంత్రుల జిల్లాల్లోనే ఈ పరిస్థితి ఉంటే ఇక రాష్ట్రవ్యాప్తంగా ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఇలాంటి స్కూళ్లలో ముఖ్యమంత్రి మనుమడు చదవగలడా అని విజయశాంతి ప్రశ్నించారు.