పశువైద్యులు దేవుళ్లతో సమానం
ABN , First Publish Date - 2022-11-30T00:32:42+05:30 IST
మూగజీవాలకు సేవచేస్తున్న పశువైద్యులు దేవుళ్లతో సమానమని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమ అభివృద్ది, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
రాజేంద్రనగర్, నవంబర్ 29 (ఆంధ్రజ్యోతి) : మూగజీవాలకు సేవచేస్తున్న పశువైద్యులు దేవుళ్లతో సమానమని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమ అభివృద్ది, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రాజేంద్రనగర్లోని పీవీ.నర్సింహారావు పశువైద్య విశ్వవిద్యాలయం, పశువైద్య కళాశాల ఆవరణలో అత్యాధునిక సదుపా యాలతో రూ. 12.75 కోట్ల వ్యవయంతో నిర్మించిన మోడరన్ వెటర్నరీ క్లినికల్ కాంప్లెక్స్ భవనాన్ని మంగళవారం విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి, చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్సీలు సురభి వాణిదేవి, శ్రీనివా్సరెడ్డి, రంగారెడ్డి జిల్లా పరిషత్ ఛైర్మన్ తీగల అనితారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ మాట్లాడుతూ పీవీ.నర్సింహారావు వెటర్నరీ విశ్వవిద్యాలయం దేశానికి ఆదర్శంగా నిలవనున్నదన్నారు. నూతనంగా నిర్మించిన కాంప్లెక్స్లో గైనకాలజీ, డయాలసిస్ ల్యాబ్, స్మార్ట్ క్లాస్రూమ్స్ అందుబాటులోకి వచ్చినట్టు చెప్పారు. త్వరలో ఎండోస్కోపి, స్కానింగ్, బ్లడ్ బ్యాంక్ అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. పశువులు, చిన్న జీవాలు, పెంపుడు జంతువులకు ఇక్కడ వైద్య సేవ లు అందుతాయన్నారు. పశువైద్య విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ వి.రవీందర్రెడ్డి మాట్లాడుతూ వెటర్న రీ క్లినికల్ కాంప్లెక్స్ విద్యార్థులకు, రైతులకు, జంతు ప్రేమికులకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో షీప్ ఫెడరేషన్ చైౖర్మన్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్, డైయిరీ చైర్మన్ సోమ భరత్కుమార్, పశుసంవర్ధక శాఖ స్పెష ల్ చీఫ్ సెక్రటరీ అధర్సిన్హా, మత్స్యశాఖ కమిషనర్ లచ్చీ రాం బూక్యా, పశుసంవర్థక శాఖ డైరెక్టర్ రాంచందర్, వెటర్నరీ వర్శిటీ రిజిస్ట్రార్ ఎస్.టీ.వీరోజీరావు, డీన్ డాక్టర్ రఘునందన్, ఎస్టేట్ ఆఫీసర్ డాక్టర్ చిన్ని ప్రీతమ్, రాజేంద్రనగర్ వెటర్నరీ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ ప్రమోద్కుమార్, వెటర్నరీ క్లినికల్ కాంప్లెక్స్ హెడ్ ప్రొఫెసర్ ఈఎల్.చంద్రశేఖర్, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ లకావత్ రాంసింగ్, రాజేంద్రనగర్ డివిజన్ కార్పొరేటర్ పి.అర్చన జయప్రకాశ్ పాల్గొన్నారు.
మూగజీవాలకు అత్యాధునిక సేవలు!
రాజేంద్రనగర్లో పెంపుడు జంతువులు, గేదెలు, ఆవులకు ఇక నుంచి ఉచితంగా అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే రాజేంద్రనగర్ వెటర్నరీ కళాశాల ఆధ్వర్యంలో డాక్టర్ ఈఎల్ చంద్రశేఖర్ నేతృత్వంలో పెంపుడు జంతువులకు రోజూ వైద్య సేవలు అందిస్తున్నారు. రూ. 12.75 కోట్లతో వెటర్నరీ క్లినికల్ కాంప్లెక్స్ భనవం, రూ. 5 కోట్లతో వైద్య పరికరాలు సమకూర్చి మూగ జంతువులకు వైద్య సేవలు అందించడానికి శ్రీకారం చుట్టారు. పశువైద్య విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు కూడా మేలు కలుగనుంది.
ఉత్తమ ఏరియా రాజేంద్రనగర్
రాజేంద్రనగర్ అత్యంత ఉత్తమ నియోజకవర్గ అభివృద్ధి చెందుతోందని చేవెళ్ల ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్రెడ్డి అన్నారు. రాజేంద్రనగర్లో నూతనంగా నిర్మించిన మోడరన్ వెటర్నరీ క్లినికల్ కాంప్లెక్స్ భవన ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన విద్యార్థులు, స్థానిక నాయకులు, ఉద్యోగులతో మాట్లాడారు. మైండ్ స్పేస్ నుంచి ఎయిర్ పోర్టు వరకు రానున్న మెట్రోరైలు ఎక్కువ భాగం రాజేంద్రనగర్ నియోజకవర్గం గూండా వెళ్తోందని గుర్తు చేశారు. అన్ని రవాణ సదుపాయాలు ఉన్న ప్రాంతంగా రాజేంద్రనగర్ నియోజకవర్గం ఉందన్నారు. ఎయిర్ఫోర్ట్కు త్వరగా వెళ్లడానికి పీవీ నర్సింహ్మరావు ఎక్స్ప్రెస్ వే, ఔటర్ రింగ్ రోడ్డు ఉన్నాయని, మెట్రో రైలు రానుండటంతో ఈ ప్రాంతం దిశ, దశ మారనుందన్నారు. మెట్రో రైలు నాల్గవ కారిడార్ డిసెంబర్ 9న ముఖ్యమంత్రి కేసీఆర్ శుంకుస్థాపన చేయనున్న సందర్భంగా నియోజకవర్గం ప్రజల తరఫున ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్కు ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు.