వల్లభనేని జనార్దన్ కన్నుమూత
ABN , First Publish Date - 2022-12-30T03:49:52+05:30 IST
తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటుడు, దర్శకుడు, నిర్మాత వల్లభనేని జనార్దన్(63) కన్నుమూశారు.
హైదరాబాద్, డిసెంబరు 29 : తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటుడు, దర్శకుడు, నిర్మాత వల్లభనేని జనార్దన్(63) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం తుది శ్వాస విడిచారు. దర్శక నిర్మాత విజయబాపినీడు మూడో కుమార్తె లలిని చౌదరి భర్త అయిన జనార్దన్ వందకు పైగా చిత్రాల్లో నటించారు. చిరంజీవి నటించిన గ్యాంగ్లీడర్ సినిమాలో చేసిన పాత్ర ఆయనకు చాలా గుర్తింపు తెచ్చిపెట్టింది. చంద్రమోహన్ హీరోగా ‘అమాయక చక్రవర్తి’, శోభన్బాబు హీరోగా ‘తోడు నీడ’, మోహన్బాబు హీరోగా ‘శ్రీమతి కావాలి’, సిల్క్ స్మిత ప్రధాన పాత్రను పోషించిన ‘పారిపోయిన ఖైదీలు’ చిత్రాలకు జనార్దన్ దర్శకత్వం వహించారు. పలు చిత్రాలను కూడా నిర్మించారు. కాగా, వారం రోజుల వ్యవఽధిలో మరణించిన ముగ్గురు సినీ ప్రముఖులకు తెలుగు చిత్ర పరిశ్రమ నివాళి అర్పించింది. పరుచూరి గోపాలకృష్ణ అధ్యక్షతన కైకాల సత్యనారాయణ, చలపతిరావు, వల్లభనేని జనార్దన్ సంతాప సభ గురువారం సాయంత్రం జరిగింది. ఆ ముగ్గురి మరణం చిత్రపరిశ్రమకు తీరని లోటు అని ఈ సందర్భంగా వ్యక్తలు అభిప్రాయపడ్డారు.