నానో టెక్నాలజీతో యూరియా
ABN , First Publish Date - 2022-08-27T05:46:33+05:30 IST
ప్రపంచ వ్యవసాయానికి నానో యూరి యా మేలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి
రాజేంద్రనగర్, ఆగస్టు 26(ఆంధ్రజ్యోతి): ప్రపంచ వ్యవసాయానికి నానో యూరి యా మేలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. శుక్రవారం రాజేంద్రనగర్ లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో వ్యవసాయంలో ఎరువులు, రసాయనాల వాడకం, నానో యూరియా వాడాల్సిన ఆవశ్యకతపై జరిగిన సదస్సులో ఆయన ప్రసంగించారు. భారతీయుడైన రమేశ్ రాలియా దీనిని కనుగొని భారత రైతాంగ శ్రేయస్సు దృష్ట్యా అమెరికా ఉద్యోగాన్ని వదులుకుని ఆ టెక్నాలజీని మనదేశంలోని ఇఫ్కో సంస్థకు అందించారన్నారు. 36 వేల సహకార సంఘాల సమాఖ్య అయిన ఇఫ్కొ ప్రపంచంలోనే అతి పెద్ద సంస్థ అని మంత్రి తెలిపారు. 11వేల మంది రైతుల పొలాలలో నానో యూరియాను ప్రయోగించి ఫలితాలు పరిశీలించి మార్కెట్లోకి విడుదల చేయాశారన్నారు. తొలిసారి యూరియాను ద్రవ రూపంలో నానో టెక్నాలజీలో అందుబాటులోకి తీసుకొచ్చారని తెలిపారు. దీని మూలంగా ఎరువుల సంచులను తరలించే పెద్ద ప్రక్రియను సులభతరం చేశారన్నారు. దేశంలోని జనాభా అహార అవసరాలను తీర్చేందుకు నూతన పద్ధతులను అనుసరించడం ప్రారంభించారన్నారు. సంప్రదాయ విత్తనాలను పక్కన పెట్టి అత్యధిక ఉత్పత్తినిచ్చే అధునిక హైబ్రిడ్ విత్తనాలను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. 1960 దశకంలో లాల్ బహదూర్ శాస్త్రీ దీనిని పంజాబ్లో మొదలు పెడితే బాబూ జగ్జీవన్రాం దానిని కొనసాగించారన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్రావు, ఇఫ్కో జీఎం డాక్టర్ జగన్మోహన్రెడ్డి, మార్క్ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి, వ్యవసాయశాఖ అదనపు కమిషనర్ హన్మంతు, అగ్రోస్ ఎండీ రాములు, మార్క్ఫెడ్ ఎండీ యాదిరెడ్డి, ఇఫ్కో జాతీ య డైరెక్టర్ దేవేందర్రెడ్డి, వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధన సంచాలకుడు డాక్టర్ ఆర్.జగదీశ్వర్, వ్యవసాయ శాఖ అదనపు సంచాలకుడు విజయ్కుమార్ పాల్గొన్నారు.