బాబోయ్.. టమాట, మిర్చి ధరలు మళ్లీ భగ్గుమంటున్నాయ్.. కిలో ఎంతంటే..
ABN , First Publish Date - 2022-05-02T14:47:31+05:30 IST
కూరగాయల ధరలు మళ్లీ భగ్గుమంటున్నాయి. కొన్నింటి ధరలు తగ్గగా
- టమోత..!
- రైతుబజార్లో కిలో రూ.38
- గత వారం కంటే రూ.16 పెరుగుదల
- ఇదే బాటలో పచ్చిమిర్చి.. కిలో రూ.65
హైదరాబాద్ సిటీ : నగరంలో కూరగాయల ధరలు మళ్లీ భగ్గుమంటున్నాయి. కొన్నింటి ధరలు తగ్గగా టమాట, పచ్చిమిర్చి ధరలు పెరిగాయి. గత ఆదివారంతో పోల్చితే ఇప్పుడు మరింత పెరిగాయి. ఏప్రిల్ 24న కొత్తపేట రైతుబజార్లో కిలో రూ.22 పలికిన టమాట ఈ ఆదివారం రూ.38కి చేరింది. కిలో రూ.60 ఉన్న పచ్చిమిర్చి రూ.65లకు విక్రయిస్తున్నారు. వారం క్రితం వంకాయ, క్యారెట్ ధరలు కిలో రూ.25 చొప్పున ఉండగా తాజాగా రూ.23లకు లభ్యమవుతున్నాయి. కిలో రూ.53 ఉన్న క్యాప్సికమ్ రూ.47కి దిగింది.
రైతుబజార్, కూరగాయల మార్కెట్తో పోల్చితే కాలనీలు, రోడ్లవెంట తోపుడు బండ్లపై టమాట, పచ్చిమిర్చి ధరలు మండిపోతున్నాయి. కిలోకు రూ.10 అదనంగా పెంచి వ్యాపారులు విక్రయిస్తున్నారు. నిమ్మకాయ (పెద్ద సైజు) కిలో రూ.250 నుంచి రూ.300, చిన్న సైజు కాయలు కిలో రూ.150 నుంచి రూ.200 వరకు విక్రయిస్తున్నారు. రంజాన్ నేపథ్యంలో వ్యాపారులు టమాట, పచ్చిమిర్చి ధరలను అమాంతం పెంచారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ మాసంలో ముస్లింలు రోజా ఉండటం, రంజాన్ రోజు బిర్యానీలు, ఇతర వంటకాలకు ఎక్కువ మొత్తంలో టమాట, పచ్చిమిర్చిని వినియోగించాల్సి ఉండడంతో రైతుబజార్లు, బయటి ప్రదేశాల్లో వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి ధరలను పెంచుతున్నారని కొనుగోలుదారులు వాపోతున్నారు.