త్రివర్ణ శోభితం
ABN , First Publish Date - 2022-08-13T06:38:54+05:30 IST
మహానగరం త్రివర్ణ శోభితమైంది.
ఆకట్టుకుంటోన్న భవనాలు, ప్రధాన చౌరస్తాలు
హైదరాబాద్ సిటీ, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): మహానగరం త్రివర్ణ శోభితమైంది. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, వ్యాపార, వాణిజ్య సంస్థలు, ప్రధాన కూడళ్లు, రహదారులు మువ్వన్నెల వర్ణాలతో నిండిపోతున్నాయి. స్వతంత్ర భారత వజ్రోత్సవాల నేపథ్యంలో గ్రేటర్లో ఎక్కడ చూసినా.. జాతీయ జెండాలు, త్రివర్ణాలతో విద్యుద్దీపాలు దర్శనమిస్తున్నాయి. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, కలెక్టరేట్, టీఎ్సఎ్సపీడీసీఎల్ కార్యాలయ భవనాలు,ఎంజీబీఎస్, జేబీఎస్ వద్ద జాతీయ జెండాలు ఏర్పాటు చేయడంతోపాటు విద్యుద్దీపాలతో అలంకరించారు. ఉప్పల్ రింగ్రోడ్డులోని స్కై వాక్, ప్రధాన చౌరస్తాల వద్ద జెండాలు, రంగురంగుల విద్యుద్దీపాలు ఆకట్టుకుంటున్నాయి. కేబుల్ వంతెన త్రివర్ణాలతో చూడముచ్చటగా ఉంది.
నేడు ఫ్రీడమ్ ర్యాలీ
జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం నుంచి ట్యాంక్బండ్పై వివేకానంద విగ్రహం వరకు శనివారం నిర్వహించనున్న ఫ్రీడమ్ ర్యాలీని విజయవంతం చేయాలని కమిషనర్ డీఎస్ లోకే్షకుమార్ కోరారు. ర్యాలీకి మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివా్సయాదవ్, వజ్రోత్సవాల కమిటీ ఛైర్మన్, ఎంపీ కె. కేశవరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమే్షకుమార్, మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలతారెడ్డి, సీపీ సీవీ ఆనంద్ హాజరవుతారని పేర్కొన్నారు. నియోజకవర్గాల్లోనూ ర్యాలీలు నిర్వహించాలని డిప్యూటీ మునిసిపల్ కమిషనర్లను ఆదేశించారు.
15న పార్కుల్లో ఉచిత ప్రవేశం
వజ్రోత్సవాలను పురస్కరించుకొని ఈనెల 15న పార్కుల్లో ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు హెచ్ఎండీఏ కమిషనర్ అర్వింద్కుమార్ తెలిపారు. లుంబినీపార్కు, ఎన్టీఆర్ గార్డెన్, సంజీవయ్య, లేక్వ్యూ, మెల్కొటే, ప్రియదర్శిని, రాజీవ్గాంధీ, పటేల్కుంట, లంగర్హౌస్, చిన్నతల్లకుంట పార్కులను సందర్శించవచ్చన్నారు.
‘గాంధీ’లో 100 మీటర్ల జెండాతో ర్యాలీ
అడ్డగుట్ట, ఆంధ్రజ్యోతి : ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా గాంధీ ఆస్పత్రి ఆవరణలో 100 మీటర్ల త్రివర్ణ పతాకంతో ర్యాలీ నిర్వహించారు. సూపరింటెండెంట్ ప్రొఫెసర్ రాజారావు, ఆర్ఎంవో డాక్టర్ జయకృష్ణ, ఈఎన్టీ ప్రొఫసర్ భూపేష్ రాథోడ్, వివిధ విభాగాల ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, వైద్య విద్యార్థులు, నర్సులు, పాల్గొన్నారు.