మెట్ల బావిని పరిశీలించిన మంత్రి
ABN , First Publish Date - 2022-11-12T00:40:45+05:30 IST
ఈనెల చివరి వారంలో బన్సీలాల్పేట్లోని అతిపురాతన మెట్లబావిని ప్రారంభించనున్నట్లు రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు.
పద్మారావునగర్, నవంబర్ 11 (ఆంధ్రజ్యోతి): ఈనెల చివరి వారంలో బన్సీలాల్పేట్లోని అతిపురాతన మెట్లబావిని ప్రారంభించనున్నట్లు రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. బన్సీలాల్పేట్ డివిజన్ పరిధిలో పునరుద్దరించిన మెట్ల బావి, పరిసరాలలో జరుగుతున్న అభివృద్ధి, నిర్మాణ పనులను మంత్రి తలసాని శ్రీనివా్సయాదవ్, మున్సిపల్ శాఖ స్పెషల్ సెక్రటరీ అరవింద్ కుమార్తో కలిసి పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. మెట్లబావి పునరుద్దరణ పనులను పర్యవేక్షిస్తున్న సాహే సంస్థ నిర్వాహకురాలు కల్పన అభివృద్ధి పనుల గురించి మంత్రికి వివరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా నిలిచే పురాతన కట్టడాలను పరిరక్షించేందుకు ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని చెప్పారు. నిజాం కాలంలో ఈ ప్రాంత ప్రజ ల నీటి అవసరాల కోసర్మించిన ఈ బావిని నాగన్న కుంటగా పిలిచేవారని చారిత్రక ఆధారాలు వెల్లడిస్తున్నాయని చెప్పారు. ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీల ఆధ్వర్యంలో సాహే సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని అభివృద్ధి చేస్తున్నట్టు తెలిపారు. సీటింగ్తో కూడిన గార్డెన్, యాంపీ థియేటర్ నిర్మాణం, రోడ్ల నిర్మాణం, అండర్ గ్రౌండ్ విద్యుత్ లైన్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ హేమలత, జోనల్ కమీషనర్ శ్రీనివాస్ రెడ్డి, టౌన్ ప్లానింగ్ ఏసీపీ క్రిస్టోఫర్, ఎలక్ర్టికల్, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.