HYD : సొంతింటి కల మరింత భారం.. ఒక్కసారిగా భాగ్యనగరంలో పెరిగిన ధరలు
ABN , First Publish Date - 2022-02-02T12:07:21+05:30 IST
కొత్తగా స్థలం లేదా ఫ్లాట్ కొనుగోలుదారులపై మరింత భారం పెరగనుంది.
- బోసిపోయిన సబ్రిజిస్ర్టార్ కార్యాలయాలు
హైదరాబాద్ సిటీ : కొత్తగా స్థలం లేదా ఫ్లాట్ కొనుగోలుదారులపై మరింత భారం పెరగనుంది. పెరిగిన ధరలు మంగళవారం నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో రిజిస్ట్రేషన్లు ఒక్కసారిగా తగ్గిపోయాయి. సోమవారం వరకు శివారు ప్రాంతాల్లో వందకు పైగా రిజిస్ర్టేషన్లు జరిగిన కార్యాలయాల్లో మంగళవారం పదిలోపే జరగడం విశేషం. ధరలు పెరగనున్న నేపథ్యంలో జనవరి 31 నాటికి రిజిస్ర్టేషన్లు పూర్తి చేసుకునేందుకు క్యూ కట్టడంతో కార్యాలయాలన్నీ కిక్కిరిసిపోయాయి.
జనవరిలో భారీగా రిజిస్ర్టేషన్లు..
గ్రేటర్ వ్యాప్తంగా జనవరిలో భారీ సంఖ్యలో రిజిస్ర్టేషన్లు జరిగాయని సబ్రిజిస్ట్రార్లు చెబుతున్నారు. రిజిస్ర్టేషన్లతో ప్రభుత్వానికి సుమారు రూ.300 కోట్ల వరకు ఆదాయం వచ్చిందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం పెరిగిన భూముల ధరల నేపథ్యంలో మరో పది రోజుల పాటు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ర్టేషన్ల సంఖ్య భారీగా తగ్గుతుందని ఓ సబ్రిజిస్ర్టార్ తెలిపారు.