Statue of Equality: సమతామూర్తి రూపశిల్పి ప్రసాద్ స్థపతికి మరో అరుదైన గౌరవం
ABN , First Publish Date - 2022-12-20T20:15:51+05:30 IST
సమతామూర్తి రూపశిల్పి, చీఫ్ అర్కిటెక్ట్ డిఎన్వి ప్రసాద్ స్థపతికి మరో అరుదైన గౌరవం దక్కింది.
హైదరాబాద్: చిన్న జీయర్ స్వామి ముచ్చింతల్ ఆశ్రమంలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన భారీ రామానుజ విగ్రహ (Statue of Equality) సమతామూర్తి రూపశిల్పి, చీఫ్ అర్కిటెక్ట్ డిఎన్వి ప్రసాద్ స్థపతికి మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించిన ప్రముఖ్ స్వామి మహరాజ్ శత జయంతి ఉత్సవాలలో ‘‘ఆలయ వాస్తు శిల్పంపై భారతీయ గ్రంథాలు- మరియూ ఆధునిక పద్ధతులకు వాటి సహకారం’’ అనే అంశంపై రెండు రోజుల అంతర్జాతీయ సదస్సులో ప్రసాద్ స్థపతి ప్రసంగించారు. గుజరాత్ అహ్మదాబాద్ నగరంలోని ఇందిరాగాంధీ జాతీయ కళా కేంద్రంలో స్వామి నారాయణ్ రీసర్చ్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అక్షర్ధామ్కు చెందిన దేశ విదేశాల నుంచి తరలివచ్చిన సీనియర్ సాధు సంతులు ఈ సదస్సులో పాల్గొన్నారు.
డిఎన్వి ప్రసాద్ స్థపతికి ఇటీవలే హిందూ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ విశ్వకర్మ అవార్డును ప్రదానం చేసింది. సమతామూర్తిగా పేరొందిన భారీ రామానుజ విగ్రహం సహా ప్రవేశ ద్వార రూపకల్పనపై ఫౌండేషన్ ప్రశంసలు కురిపించింది. ఈ విగ్రహం అత్యంత గొప్ప నిర్మాణాలలో ఒకటని ప్రశంసించింది. రామానుజాచార్యుల బంగారు విగ్రహం, ప్రవేశద్వారం వద్ద సూక్ష్మ వివరాలతో నిర్మితమైన ప్రామాణిక తోరణాలు మంత్రముగ్దులను చేస్తాయని కొనియాడింది.