Love చేసిన వ్యక్తి మోసం చేసాడని.. Software ఉద్యోగిని ఆత్మహత్య
ABN , First Publish Date - 2022-02-14T15:32:14+05:30 IST
స్నేహం పేరుతో పరిచయం పెంచుకుని, ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు
హైదరాబాద్ సిటీ/అమీర్పేట : స్నేహం పేరుతో పరిచయం పెంచుకుని, ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. పెళ్లి ఊసొచ్చేసరికి ముఖం చాటేశాడు. దీంతో మనస్తాపానికి గురైన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తన మరణానికి నవీన్ కారణమని, అతడిని కఠినంగా శిక్షించాలని, సూసైడ్ నోట్లో పేర్కొంది. ఎస్ఆర్నగర్ సీఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖపట్నం జిల్లా కేంద్రం రాంనగర్కు చెందిన వసరాల అనూష (22) రెండేళ్ల క్రితం నగరానికి వచ్చి ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. మధురానగర్లో ఉంటోంది.
కొంత కాలంగా నవీన్తో పరిచయం ఏర్పడింది. అది ప్రేమకు దారి తీసింది. పెళ్లి చేసుకోవాలని కొద్ది రోజులుగా అనూష కోరుతోంది. నవీన్ నిరాకరించడంతో జీవితంపై విరక్తి చెందిన అనూష ఉరేసుకుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు తలుపు తీయకపోవడం, ఎన్నిసార్లు పిలిచినా పలకకపోవడంతో అనుమానం వచ్చి ఇంటి యజమాని కిటికీలు పగులగొట్టి చూడగా ఫ్యాన్కు వేలాడుతూ కనిపించింది. గాంధీ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే అనూష మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతురాలి సోదరుడు అవినాష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.